ఒలింపియా (గ్రీస్) : పారిస్ ఒలింపిక్స్కు వంద రోజుల కౌంట్ డౌన్ మొదలైంది. ఒలింపిక్స్కు పుట్టినిల్లుగా భావించే గ్రీస్లోని ఒలింపియాలో మంగళవారం ఒలింపిక్ జ్యోతి వెలగడంతో పారిస్ గేమ్స్లో కీలక ఘట్టానికి తెరలేచినట్టయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఆకాశం మేఘావృతం కావడంతో సంప్రదాయానికి భిన్నంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణంగా గ్రీకు పూజారిణి మాదిరిగా దుస్తులు ధరించిన నటి పురాతన గ్రీకు సూర్య దేవుడికి(అపోలో) పూజ చేసి నూనె నింపిన టార్చ్ను పారాబోలిక్ అద్దంలో ఉంచుతుంది.
సూర్య కిరణాలు తాకి టార్చ్ లో మంట పుట్టేది. కానీ, ఈసారి ఓ కుండలో ఉంచిన మంట నుంచి టార్చ్ను వెలిగించారు. ఈ ఒలింపిక్ జ్యోతిని ఒలింపియా స్టేడియం నుంచి టార్చ్ బేరర్లు గ్రీసులో దాదాపు 5 వేల కిలోమీటర్ల దూరం రిలేగా తీసుకెళ్లారు. అనంతరం ఈనెల 26న ఏథెన్స్లో పారిస్ గేమ్స్ ఆర్గనైజర్లకు అందజేస్తారు. మొదటి టార్చ్ బేరర్గా 2021లో టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్
గ్రీస్ రోవర్ స్టెఫానోస్ డౌస్కోస్ జ్యోతిని అందుకున్నాడు. అతని నుంచి 2004లో ఏథెన్స్లో మూడు మెడల్స్ గెలిచిన ఫ్రెంచ్ స్విమ్మర్ లారే మనౌడౌ బ్యాటన్ అందుకొని యూరోపియన్ యూనియన్ సీనియర్ అధికారి మార్గరీటిస్ షినాస్కు అప్పగించాడు. పారిస్ లో జులై 26 నుంచి ఆగస్టు 11వరకు ఒలింపిక్స్ జరుగుతాయి.