భారతదేశంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఇండ్లన్నీ నీట మునిగాయి. పర్యాటక ప్రాంతంగా పిలవపడే హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కులు మనాలీలో వరద పోటెత్తింది. భారీ వర్షాలతో కులు మనాలీలోని బస్టాండు నీట మునిగిపోయింది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేరడంతో బస్టాండులో ఉన్న బస్సుల్లోకి నీరు వచ్చి చేరింది. సగం వరకు బస్సులు నీటిలో మునిగిపోయాయి. అక్కడనే ఉన్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు... మహారాష్ట్రలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ముంబాయిలో నిన్న కుంభవృష్టి కురిసింది. నాసిక్, పాల్ఘర్, పుణె జిల్లాలకు మూడ్రోజుల పాటు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 13 NDRF, 3 SDRF బృందాలను ఫీల్డ్ లోకి పంపారు. మహారాష్ట్రలో ముగ్గురు పిల్లలతో పాటు 9 మంది మృతి చెందారు.
రెండు గంటల పాటు ముంబాయి సిటీ, శివారు ప్రాంతాలు రెండు గంటల పాటు విలవిల్లాడాయి. ఓ బిల్డింగ్ కూలి ఇద్దరు చనిపోయారు. గడ్చిరోలి జిల్లాలో ఓ వ్యక్తి గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. నాగపూర్ జిల్లాలో మంగళవారం ఓ వంతెన మీదుగా వాహనం కొట్టుకుపోయి.. మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. పుణే జిల్లాలోని చాకన్ ప్రాంతంలో నీటితో నిండిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. భారీ స్థాయిలో వరద నీరు పోటెత్తడంతో.. నాసిక్ దగ్గర నదిలో నీటి ప్రవాహం భారీగా చేరింది. దీంతో నాసిక్ లో ఉన్న పలు ఆలయాలు నీట మునిగాయి. నదికి ఇరువైపులా వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
#WATCH Flash flood at Manali bus stand due to heavy rainfall in the area; Few buses damaged, no major loss reported#HimachalPradesh pic.twitter.com/EkkjVRDsGc
— ANI (@ANI) July 13, 2022