- 10 మంది మృతి కజిరంగా కూడా మునిగింది
- ఖడ్గమృగాలు వేరే చోటికి తరలింపు
అస్సాంలో వరదలు ఉధృతంగా ఉన్నాయి.33 జిల్లాల్లో 21 జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి.వరదల వల్ల ఇంతవరకు పదిమంది చనిపోయారని అధికారులు చెప్పారు. ఎనిమిది లక్షల 70 వేల మందికి పైగా వరదల ప్రభావానికి గురయ్యారు. బ్రహ్మపుత్రతోపాటు మరో ఐదు నదులు డేంజర్ మార్క్ను దాటి ప్రవహిస్తున్నాయి. 27 వేల హెక్టార్ల మేర పంటచేలు మునిగిపోయాయి. వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 68 రిలీఫ్ క్యాంపుల్ని పెట్టింది. ఏడు వేల మంది వరద బాధితుల్ని రిలీఫ్ క్యాంపులకు తరలించారు. తేయాకు ఎక్కువగా పండే ధెమాజీ, లఖిమ్పూర్ (అప్పర్ అస్సాం), బొంగైగామ్, బార్పేట ( లోవర్ అస్సాం) ప్రాంతాలకు బాగా నష్టం జరిగింది. ఎగువ నుంచి వరద నీరు లోయల్లోకి రావడంతో లోయర్ అస్సాంలోని ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. బార్పేట బాగా నష్టపోయింది. ఈప్రాంతానికి చెందిన 85 వేల మంది షెల్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. కజిరంగా నేషనల్ పార్క్లోకి వరద నీరు చేరడంతో అక్కడున్న అరుదైన ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను బలవంతంగా షెల్టర్లకు తరలించారు. ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు.
బద్రీనాథ్ హైవేలో ట్రాఫిక్ జామ్
చమోలీ (ఉత్తరాఖండ్): కుండపోత వర్షాలకు ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. బద్రీనాథ్ హైవేలో నీరు నిలిచిపోవడంతో శనివారం ఉదయం ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు కొన్నిగంటలపాటు రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. బండరాళ్లు పడడంతో హైవేలో ఉన్న బాజ్పూర్, బిర్హి, పిపల్కోటి దగ్గర రోడ్డు బ్లాక్ అయింది. టూరిస్టు బస్సు ఒకటి చాలాసేపు వరదనీటిలో చిక్కుకుంది.
బీహార్లో ఇద్దరు మృతి
పాట్నా: బీహార్ను వర్షాలు వదలడంలేదు. భారీ వర్షాలకు కిషన్గంజ్ లో ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆరు జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. వరద ప్రభావిత జిల్లాల్లో రెస్క్యూ, రిలీఫ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నట్టు అధికారులు చెప్పారు.
నేపాల్లో 28కి చేరిన మృతుల సంఖ్య
ఖాట్మాండు: నేపాల్లో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. వర్షాలకు చనిపోయినవారి సంఖ్య శనివారంనాటికి 28కి పెరిగింది. మరో 16 మంది గల్లంతయ్యారని అధికారులు చెప్పారు. కొండచరియలు విరిగడంతోపాటు లోతట్టుప్రాంతాలు నీటమునిగిపోతున్నాయి.