భారత మార్కెట్లోకి రిలీజ్ అయ్యే అన్ని స్మార్ట్ఫోన్లలో ఇకపై ఎఫ్ఎం రేడియో ఫీచర్ డిఫాల్ట్గా ఉండాల్సిందేనని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. స్మార్ట్ఫోన్లలో FM రేడియోను సులభంగా యాక్సెస్ చేసేందుకు భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీదారులకు అడ్వైజరీని పంపింది. అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు రేడియో సర్వీసుల ద్వారా సమాచారం,వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని కంపెనీలకు చెందిన ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ఉండటం లేదు. ఇక అలా కుదరదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఎం రేడియో ఉన్న స్మార్ట్ఫోన్లలో ఎఫ్ఎం రేడియో సదుపాయం తగ్గిపోతున్నట్టు కేంద్రం గుర్తించింది. సమాచార వ్యాప్తిలో డిజిటల్ అంతరం తగ్గించేందుకు ఎఫ్ఎం రేడియో చాలా అవసరమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అత్యవసర పరిస్థితిల్లో ఎఫ్ఎం రేడియో కీలకమని వెల్లడించింది.
ఎఫ్ఎం రేడియో సేవలు కీలకం
మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ఎఫ్ఎం రేడియో సదుపాయం ఉండాలంటూ ఫోన్ తయారీదారులకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సమాచారం, ఎంటర్టెయిన్మెంట్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు ఇది అవసరమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, అత్యవసర పరిస్థితులు, విపత్తులు, ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఎఫ్ఎం రేడియో సేవలు ఎంతో కీలకంగా మారతాయని పేర్కొంది. ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ..మొబైల్ తయారీదారుల సంఘాలైన ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్, మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి లిఖిత పూర్వక సూచనలు జారీ చేసింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో ఎఫ్ఎమ్ రేడియోలు కీలక పాత్ర పోషిస్తాయని కూడా పేర్కొంది.
ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు
ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో సదుపాయం లేకపోవడాన్ని తాము గుర్తించినట్టు ఐటీ మంత్రిత్వ శాఖ తన నోటీసుల్లో పేర్కొంది. ఇది పేద ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని తెలిపింది. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు పేద ప్రజలు ప్రభుత్వ సమాచారం కోసం ఎఫ్ఎం రేడియోపైనే ఆధారపడతారని పేర్కొంది. స్మార్ట్ఫోన్లతో పాటూ స్టాండ్ ఎలోన్ రేడియోలు, కార్లలో రేడియో రిసీవర్లూ అవసరమని కూడా ఐటీ మంత్రిత్వ శాఖ తన నోటీసుల్లో స్పష్టం చేసింది.