
న్యూఢిల్లీ: రూరల్ ఏరియాలలో సబ్బులు, షాంపూలు వంటి ప్రొడక్టుల అమ్మకాలు మూడో క్వార్టర్లో పుంజుకుంటాయని ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా తమ మార్జిన్లు మెరుగుపడతాయని ఆశలు పెట్టుకుంటున్నాయి. ఇన్ఫ్లేషన్ ఒకింత ఎక్కువగానే ఉండటంతో సెప్టెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీలు మార్జిన్ల విషయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. పండగల సీజన్ మొదలవడంతోపాటు, రుతుపవనాలు బాగుండటంతో పంటలు బాగా పండుతాయని, దీంతో రూరల్ ఏరియాలలో తమ ప్రొడక్టులకు డిమాండ్ ఊపందుకుంటుందనేది ఎఫ్ఎంసీజీ కంపెనీల నమ్మకం.
అన్ని కంపెనీలదీ అదే పరిస్థితి...
జులై–సెప్టెంబర్ మధ్య కాలంలో హెచ్యూఎల్, ఐటీసీ, డాబర్, నెస్లే, టాటా కన్జూమర్, బ్రిటానియా, మారికో వంటి లిస్టెడ్ ఎఫ్ఎంసీజీ కంపెనీలు మార్జిన్ల విషయంలో ఇబ్బంది పడ్డాయి. రేట్ల పెరుగుదల ఎఫెక్ట్ వినియోగంపై పడటంతో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ఆ కంపెనీలు పేర్కొన్నాయి. పామ్, ఖోప్రా వంటి కమోడిటీల రేట్లు కొంత తగ్గుముఖం పట్టడంతో ఈ క్వార్టర్లో తమ గ్రాస్ మార్జిన్లు మెరుగుపడతాయని ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆశిస్తున్నాయి. రేట్లు ఎక్కువగా ఉండటంతో సెప్టెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీల ఆదాయం పెరిగింది. అయితే కొన్ని సెగ్మెంట్లలో మాత్రం బ్రిటానియా, డాబర్, నెస్లే వంటి కంపెనీలు సేల్స్ వాల్యూమ్నూ పెంచుకోగలిగాయి.
రిటెయిల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వరసగా నాలుగో క్వార్టర్లోనూ సేల్స్ వాల్యూమ్ తగ్గినట్లు మారికో వెల్లడించింది. డిమాండ్ అంతకు ముందు క్వార్టర్లలోలాగే నెమ్మదిగా ఉందని, సెప్టెంబర్ క్వార్టర్లోని చివరి నెలలో మాత్రమే కొంత ఊపందుకుని కూడా ఈ కంపెనీ వివరించింది. పారాచూట్ బ్రాండ్ పేరుతో హెయిర్ అండ్ కేర్ ప్రొడక్టులను మారికో విక్రయిస్తోంది. క్యూ 3 నుంచి గ్రాస్ మార్జిన్లు మెరుగుపడతాయనే ఆశాభావాన్ని ఈ కంపెనీ వ్యక్తం చేస్తోంది. జులై–సెప్టెంబర్ క్వార్టర్లో మారికో నికర లాభం 3 శాతం తగ్గి రూ. 307 కోట్లకు చేరింది. మరోవైపు అత్యధిక క్వార్టర్లీ రెవెన్యూ సాధించిన బ్రిటానియా కూడా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ పడుతోందనే పేర్కొంది. ఫ్లోర్, మిల్క్ ప్రొడక్టుల ఇన్ఫ్లేషన్ను ప్రత్యేకంగా ఈ కంపెనీ ప్రస్తావించింది. గుడ్డే, టైగర్, న్యూట్రిఛాయిస్, మిల్క్బికిస్, మేరీ గోల్డ్ వంటి ప్రొడక్టులను బ్రిటానియా కంపెనీ విక్రయిస్తోంది. బ్రిటానియా కంపెనీకి సెప్టెంబర్ క్వార్టర్లో నికర లాభం 28.5 శాతం పెరిగింది. ఈ క్వార్టర్లో కంపెనీకి రూ. 490.58 కోట్ల నికరలాభం వచ్చింది. ఇదే టైములో మొత్తం రెవెన్యూ కూడా 21.40 శాతం గ్రోత్తో రూ. 4,379.61 కోట్లుగా రికార్డయింది.
ఇన్ఫ్లేషన్ ఎఫెక్టే....
ఇన్ఫ్లేషన్ పెరుగుదలతో మార్కెట్లో సవాళ్లనే ఎదుర్కొంటున్నట్లు మరో ఎఫ్ఎంసీజీ కంపెనీ డాబర్ వెల్లడించింది. రూరల్ ఏరియాలలో ఈ ఎఫెక్ట్ బాగా కనబడుతోందని, అక్కడ అమ్మకాలు పెరగడం లేదని డాబర్ సీఈఓ మోహిత్ మల్హోత్రా చెప్పారు. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వినియోగంపై ఉందని మరో ఎఫ్ఎంసీజీ కంపెనీ హెచ్యూఎల్ కూడా పేర్కొంది. కొన్ని కమోడిటీల రేట్లు దిగి రావడంతో ఈ క్వార్టర్ నుంచి పరిస్థితులు మెరుగుపడొచ్చని హెచ్యూఎల్ సీఈఓ సంజీవ్ మెహతా చెప్పారు. రుతుపవనాలు బాగుండటంతోపాటు, ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు తీసుకున్న చొరవ కారణంగా రాబోయే నెలల్లో వినియోగం జోరందకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.