ఫోక్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. యూట్యూబ్లో జంటగా జానపద పాటలకు స్టెప్పులేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డ్యాన్సర్ల వివాదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఊహించని విధంగా వీరి రగడ ఇప్పుడు పోలీస్ కేస్ డ్రామాగా మారింది. పెళ్లి పేరుతో నమ్మించి తనను శారీరకంగా వాడుకుని ఇప్పుడు ముఖం చాటేశాడని మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
వివాదం ఎక్కడ మొదలైందంటే?
ఈ ఫోక్ డ్యాన్సర్లు వ్యవహారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రారంభమైంది. ఇప్పటికే పెళ్లయి ఒక బాబు ఉన్న ఈశ్వర్ సాయి, తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్తో కలిసి వేములవాడలోని ఒకే రూమ్లో ఉండగా.. ఈశ్వర్ భార్య శరణ్య అక్కడికి వెళ్లి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ సమయంలో జరిగిన రచ్చ, వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇది కాస్త వారి మధ్య వివాదానికి దారితీసింది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెళ్లలో ఇంటర్వ్యూలు, మీమ్లతో రచ్చ రచ్చ జరిగింది.
మోసం, వేధింపుల ఆరోపణలు...
ఇంతవరకు ఒక ఎత్తయితే.. లేటెస్ట్ గా మాధురి రాథోడ్ నార్సింగి పోలీసులను ఆశ్రయించడంతో వీరి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని ఇప్పుడు ముఖం చాటేశాడని ఆమె కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు, సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి తన పరువు తీస్తున్నాడని, డిజిటల్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.
పరారీలో ఈశ్వర్ సాయి..
మాధురి రాథోడ్ ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో ఈశ్వర్ సాయి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఫోక్ డ్యాన్సర్ల వివాదం మన్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
