కుళ్లిన మాంసంతో వంటలు .. రుచి, రంగు కోసం కెమికల్స్ వినియోగం

కుళ్లిన మాంసంతో  వంటలు .. రుచి, రంగు కోసం కెమికల్స్ వినియోగం
  • ఫిష్​, రొయ్యలు, ఇతర సీ ఫుడ్ ఐటమ్స్ రోజుల తరబడి నిల్వ
  • వరంగల్ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్ల  ఇష్టారాజ్యం
  • నోటీసులకే పరిమితమవుతున్న అధికారులు
  • సీజ్​ చేయాలని ప్రజల డిమాండ్​

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. కుళ్లిన మటన్, చికెన్ తో బిర్యానీలు, రోజుల తరబడి నిల్వ చేసిన వివిధ రకాల ఫిష్, రొయ్యలతో వెరైటీ వంటకాలు చేసి, కస్టమర్లకు సర్వ్​చేస్తున్నాయి. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు రుచి కోసం వివిధ రకాల కెమికల్స్, టేస్టింగ్ పౌడర్స్ వాడుతూ వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్లు అడపాదడపా తనిఖీలు చేస్తూ కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకొంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఎలాంటి చర్యలు లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్ల నిర్వాహకులు యథేచ్ఛగా ఆహార దందా కొనసాగిస్తున్నారు. 

నిబంధనలు తుంగలో తొక్కుతూ..

గ్రేటర్​వరంగల్ వ్యాప్తంగా చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి సుమారు 800 వరకు బిర్యానీ సెంటర్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వేడి వేడి బిర్యానీ, మంచూరియా, ఫ్రైడ్ రైస్ సప్లై చేస్తున్న నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ రూల్స్ ను తుంగలో తొక్కుతున్నారు. కనీస శుభ్రత పాటించడం లేదు. వంటకాల్లో క్వాలిటీ లేని పదార్థాలే వాడుతున్నారు. చాలాచోట్ల ఆలుగడ్డల గుజ్జుతో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వినియోగిస్తుండగా, కుళ్లిపోయిన కూరగాయలు, కెమికల్స్​ కలిపిన మసాలాలు, టేస్టింగ్ పౌడర్స్​తో బిర్యానీలు, ఇతర వెరైటీలు చేస్తున్నారు. మటన్, చికెన్​, సీ ఫుడ్​ఐటమ్స్​రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. సరైన టెంపరేచర్ మెయింటేన్​చేయని కారణంగా అవి కుళ్లిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాటిలో పురుగులు తయారైనా క్లీన్​చేసి, బిర్యానీలు తయారు చేస్తున్నారు.  

 48 హోటళ్లకు కేవలం నోటీసులే.. 

ఇప్పటివరకు హనుమకొండ జిల్లాలో 23, వరంగల్ జిల్లాలో 25 హోటళ్లు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ -–2006 రూల్స్ పాటించలేదని అధికారులు నోటీసులు ఇచ్చారు. కొన్ని హోటళ్ల నుంచి ఫుడ్​శాంపిల్స్​సేకరించి, హైదరాబాద్​ల్యాబ్ కు పంపించారు. కానీ, ఇంతవరకు ఏ ఒక్క హోటల్ పైనా కఠిన చర్యలు తీసుకోలేదు. కుళ్లిన మాంసంతో వంటకాలు చేస్తున్న, కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తున్న హోటళ్లను సీజ్​చేయాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. అధికారులు ఇకనైనా కఠిన చర్యలు​ తీసుకుంటారో లేదో చూడాలి.

బడా హోటళ్ల తీరే వేరు..

వరంగల్ ట్రై సిటీలో పేరుగాంచిన బడా హోటళ్లు ఫుడ్ సేఫ్టీ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సాధారణంగా ఒకసారి వాడిన నూనెను తర్వాత  తీసేయాలి. కానీ, చాలా హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు ఎన్ని వంటకాలైనా అదే నూనె వినియోగిస్తున్నాయి. తాజాగా ఈ నెల 5న స్టేట్​ఫుడ్ సేఫ్టీ టాస్క్​ఫోర్స్ టీం నక్కలగుట్టలోని ల్యాండ్ మార్క్​హోటల్ తోపాటు ఫుడ్ ఆన్​ఫైర్​బిర్యానీ సెంటర్​ లో తనిఖీ చేపట్టింది. ఈ రెండింటిలోనూ కుళ్లిపోయిన చికెన్, మటన్, బూజు పట్టిన కాలీఫ్లవర్, క్యాబేజీ, కరాబైన ఫిష్​, రొయ్యలను చూసి అధికారులు షాక్​ అయ్యారు. పరిశుభ్రత కూడా పాటించకపోవడంతో రెండు హోటళ్లకు నోటీసులు ఇచ్చారు. అంతకుముందు హనుమకొండలోని అశోక హోటల్​, శ్రేయ హోటల్, హోటల్ అరణ్యంలో బూజు పట్టిన చికెన్, కరాబైన నూనె, కాలం చెల్లిన చికెన్​ మసాలాలు, సాస్​బాటిల్స్, చికెన్​ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నారు.