ఐదు రోజులుగా పంజాబ్ పోలీసులు అమృత్​ కోసం గాలింపు

ఐదు రోజులుగా పంజాబ్ పోలీసులు అమృత్​ కోసం గాలింపు
  •     జలంధర్ దగ్గర్లో బైక్ స్వాధీనం
  •     నేపాల్ బార్డర్​లో హైఅలర్ట్
  •     గురుద్వారాలో సెర్చింగ్
  •     అసెంబ్లీలో అమృత్​పాల్ లొల్లి

చండీగఢ్/న్యూఢిల్లీ: ఖలిస్తానీ నేత అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఐదో రోజైన బుధవారం కూడా అతని ఆచూకీ లభించలేదు. చివరిసారిగా టూ వీలర్​పై ట్రావెల్ చేస్తూ కనిపించిన అమృత్​పాల్ సింగ్, తర్వాత ఎక్కడికెళ్లాడో పోలీసులు గుర్తించలేకపోతున్నారు. జలంధర్ సిటీకి 45 కి.మీ దూరంలో ఉన్న దారాపూర్ ఏరియాలోని కాలువ దగ్గర అమృత్​పాల్ ప్రయాణించిన బజాజ్ ప్లాటినం బైక్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘వారిస్ ​పంజాబ్ ​దే’ చీఫ్ అయిన అమృత్​పాల్​పై పంజాబ్ పోలీసులు లుకౌట్ నోటీసులతో పాటు నాన్​బెయిలబుల్ వారెంట్ (ఎన్​బీడబ్ల్యూ) జారీ చేశారు. అమృత్​పాల్​ను త్వరలోనే అరెస్ట్​ చేస్తామని పంజాబ్ ఐజీ సుఖ్​చైన్ సింగ్ తెలిపారు.

ఉత్తరాఖండ్​లో సెర్చ్ ఆపరేషన్

ఉత్తరాఖండ్​లోని ఉధంసింగ్ నగర్ జిల్లా ఇండో–నేపాల్ బార్డర్​లోని గురుద్వారాలు, హోటల్స్, పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు అమృత్​పాల్ కోసం వెతుకుతున్నారు. అమృత్​సర్​లోని సింగ్ ఇంటికెళ్లిన పంజాబ్ పోలీసులు అతని అమ్మను విచారించారు. విదేశాల నుంచి వచ్చిన ఫండ్స్ పై అమృత్​పాల్ భార్య కిరణ్ దీప్ కౌర్​ను జల్లుపూర్ ఖేడాలో ఇద్దరు డీఎస్పీలు ప్రశ్నించారు.

దెబ్బకు దిగొచ్చిన యూకే సర్కార్

బ్రిటన్​లోని ఇండియన్​ హైకమిషన్​పై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేయడాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ చాణక్యపురిలోని శాంతిపథ్‌లోని బ్రిటన్‌ హైకమిషన్‌ ఆఫీస్ ముందున్న బారికేడ్లను తొలగించింది. దీంతో యూకే సర్కార్ దెబ్బకు దిగొచ్చింది. బ్రిటన్​లో ఇండియా హౌస్ అని పిలిచే హైకమిషన్ ఆఫీస్​కు భద్రత పెంచింది. కాగా, పంజాబ్ ప్రశాంతంగా ఉందని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని యూకేలోని ఇండియన్​ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి స్పష్టం చేశారు.

నంగల్ అంబియన్ గురుద్వారాలో..

శనివారం మధ్యాహ్నం 45 నిమిషాల పాటు అమృత్​పాల్.. నంగల్ అంబియన్ గురుద్వారాలో గడిపినట్లు అక్కడి గ్రంథి (పూజారి), ఆయన భార్య మీడియాకు బుధవారం వెల్లడించారు. ‘‘అమృత్​పాల్, మరో ముగ్గురు గురుద్వారాకు వచ్చారు. డ్రెస్సులుంటే ఇవ్వాలనడంతో మా కొడుకు డ్రెస్సులిచ్చాం. మా ఫోన్ తీసుకున్నారు. 1 గంటకు వచ్చి.. 1.45 దాకా ఉన్నారు. వెళ్లేటప్పుడు ఫోన్​ ఇచ్చేసి..  తలపాగా మార్చుకున్నారు. అమృత్​పాల్​ కోసం పోలీసులు వెతుకుతున్నారని సాయంత్రం తెలిసింది” అని పూజారి, ఆయన భార్య చెప్పారు.

న్యాయపరంగా హెల్ప్ చేస్తాం: బాదల్

అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసుల వేట రాజ్యాంగ విరుద్ధమని శిరోమణి అకాలీదళ్ ఆరోపించింది. అరెస్ట్​ అయిన సిక్కు యువకులందరికీ న్యాయపరంగా సాయం అందిస్తామని పార్టీ లీడర్ సుఖ్​బీర్​సింగ్ బాదల్ ప్రకటించారు.

అసెంబ్లీలో ప్రతిపక్షాల నిరసన

అమృత్​పాల్​పై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగించడాన్ని శిరోమణి అకాలీదళ్ అసెంబ్లీలో ఖండించింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా క్వశ్చన్​ అవర్ ప్రారంభంకాగానే లా అండ్ ఆర్డర్​పై చర్చించాలని కాంగ్రెస్​ ప్రతిపక్ష నేత ప్రతాప్​సింగ్ స్పీకర్​ కుల్తార్​ సింగ్​ను కోరారు. దాన్ని డిస్మిస్​ చేసినట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ వెల్​లోకి దూసుకెళ్లారు.  ఎన్ఎస్ఏ ప్రయోగం సరికాదన్నారు. రాష్ట్రంలో టెర్రరిస్టుల పాలన నడుస్తున్నదని జీరో అవర్​లో శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యే మన్​ప్రీత్ సింగ్ మండిపడ్డారు. అమాయకులను జైల్లో పెట్టారని ఫైర్ అయ్యారు.