చూపులేని వారికి ఓటు వేసే అవకాశం : హనుమంతు జెండగే

చూపులేని వారికి ఓటు వేసే అవకాశం : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : చూపులేని వారికి సహాయకుడితో ఓటు వేసే అవకాశం ఉందని, ఫారం 14-–ఏ నిబంధనల ప్రకారం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చని కలెక్టర్​హనుమంతు జెండగే తెలిపారు. సోమవారం కలెక్టరేట్​లో పోలింగ్​విధానంపై అధికారులకు ట్రైనింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంపై అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు.

ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు 1052 ప్రిసైడింగ్, 1054 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు చెప్పారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రాల్లో అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. హ్యాండ్ బుక్ లో సూచించిన విధంగా ఆఫీసర్లు విధులు నిర్వహించాలన్నారు.

పోలింగ్ ముందు మాక్ పోల్ సమయంలో కనీసం 50 ఓట్లు వేయాలని,  నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ఫారం-12– D ద్వారా వివరాలు ఇవ్వాలని సూచించారు. 

రూల్స్​కు లోబడి ప్రింటింగ్.. 

ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రింటింగ్ ప్రెస్​నిర్వాహకులు వ్యవహరించాలని అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ తెలిపారు. సోమవారం ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సామగ్రిని ప్రింటింగ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా రూల్స్​ను ఆయన వివరించారు. వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో అడిషనల్​కలెక్టర్​గంగాధర్, ఆర్డీవో అమరేందర్, డీఈవో నారాయణరెడ్డి, ఏవో జగన్మోహన్ ప్రసాద్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.