టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా గత కొన్నినెలలుగా క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్, ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఆడలేదు. ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేలకు కూడా బుమ్రాను ఎంపిక చేయలేదు. అయితే మార్చి 31 నుంచి జరగనున్న ఐపీఎల్ లో బుమ్రా ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా బుమ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రా ఐపీఎల్ ఆడకపోతే ప్రపంచమేమీ అంతం కాదని..అతడు ఆడేందుకు బీసీసీఐ అనుమతించొద్దని అన్నారు.
‘బుమ్రా మొదట భారత ఆటగాడు. తర్వాతే ప్రాంఛైజీ ప్లేయర్. కాబట్టి బుమ్రా ఫిట్ నెస్ గా లేకుంటే బీసీసీఐ ప్రాంఛైజీతో సంప్రదింపులు జరపాలి. బుమ్రాను ఐపీఎలో ఆడకుండా చూడాలి. మొదటి ఏడు మ్యాచ్ లకు బుమ్రా ప్లేసులో జోసఫ్ ఆర్చర్ తో ఆడిస్తే ప్రపంచమేమీ అంతం కాదు. పూర్తి ఫిట్ నెస్ ఉంటేనే బుమ్రా అన్ని మ్యాచ్ లు ఆడాలి. బుమ్రా జాతీయ ఆస్తి కాబట్టి.. జాగ్రత్తగా చూసుకోవాలి ‘ అని ఆకాశ్ చొప్రా వ్యాఖ్యానించారు.