తన హోటల్ రూమ్కు సంబంధించిన వీడియో వైరల్ అవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన గదిలో కూడా వ్యక్తిగత స్వేచ్ఛ లేకుంటే ఎలా అని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించే అభిమానం తనకు వద్దని కోహ్లీ స్పష్టం చేశాడు.
వీడియోలో ఏముంది...
టీ20 వరల్డ్ కప్లో భాగంగా కోహ్లీ సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడాడు. ఇందులో భాగంగా పెర్త్లో ఓ హోటల్లో కోహ్లీ స్టే చేశాడు. అయితే రూమ్కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది. అందులో విరాట్ తన వస్తువులను ఎలా పెట్టుకుంటాడో అనే విషయాన్ని చూపించారు. అలాగే కోహ్లీ వాడే వస్తువులతో పాటు.. వాష్ రూమ్ను కూడా వీడియో తీశారు. షూస్ కలెక్షన్స్, ఫేస్ క్రీమ్స్, కిట్ బ్యాగ్ను చూపించారు.
వీడియోతో షాకైన కోహ్లీ
తన రూమ్లోని వస్తువులకు సంబంధించిన వీడియోను చూసిన కోహ్లీ షాకయ్యాడు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరైనా సరే తమ వినోదం కోసం క్రికెటర్లను వస్తువుగా భావించొద్దని సూచించాడు. అభిమానులు తమ ఫేవరేట్ ఆటగాళ్లను చూసేందుకు, కలిసేందుకు ఉత్సాహం చూపిస్తారని..దాన్ని తాను అర్థం చేసుకోగలనన్నాడు. కానీ..ఇలా వ్యక్తిగత వస్తువులను వీడియో తీయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు.
ఉన్మాదపు అభిమానాన్ని సహించను
తన హోటల్ రూంలోని వస్తువులను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం తన వ్యక్తిగత స్వేచ్చను హరించేలా ఉందని కోహ్లీ అన్నాడు. హోటల్ రూమ్లో కూడా తనకు వ్యక్తగత స్వేచ్ఛ లేకుంటే ఎలా ప్రశ్నించాడు. ఇలాంటి ఉన్మాదపు అభిమానాన్ని తాను ఎప్పటికీ సహించబోనని తేల్చి చెప్పాడు. ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కరెక్ట్ కాదన్నాడు. అభిమానులు ప్లేయర్లు వ్యక్తిగత స్వేచ్ఛకు గౌరవం ఇవ్వండని కోరాడు.