గారడి మాటలు.. గాలి హామీలు నమ్మొద్దు : పొన్నం ప్రభాకర్

గారడి మాటలు.. గాలి హామీలు నమ్మొద్దు : పొన్నం ప్రభాకర్

​హుస్నాబాద్​, వెలుగు : సీఎం కేసీఆర్​ గారడి మాటలు, గాలి హామీలు ప్రజలు నమ్మొద్దని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ అన్నారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్​ ఆఫీసులో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో కాంగ్రెస్​కు పెరుగుతున్న ఆదరణను చూసి ఆయనకు వణుకుపుట్టిందన్నారు. అందుకే తమ పార్టీ రూపొందించిన పథకాలను కాపీ కొట్టాడని ఎద్దేవా చేశారు.

2018లో  ఇచ్చిన ఎన్నికల హామీలనే అమలుచేయలేదు ఇప్పుడు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తాడో ప్రజలు ఆలోచించాలన్నారు.  గ్యాస్​ సిలిండర్​ రూ.4 00 కే ఇస్తామంటున్న కేసీఆర్​ ముందుగా 2018 నుంచి ఇప్పటి వరకు గ్యాస్​ వినియోగదారుల ఖాతాల్లో మిగితా డబ్బులు జమచేయాలని డిమాండ్​ చేశారు.  తెలంగాణ వచ్చి పదేండ్లు దాటుతున్నా ఒక్క గ్రూప్​-1 పరీక్ష నిర్వహించని అసమర్థుడు కేసీఆర్​ అన్నారు.  

ఇప్పటి వరకు డీఎస్సీ ఎగ్జామ్​ కూడా నిర్వహించలేదన్నారు. ఏ ఎమ్మెల్యేకూ అపాయింట్​మెంట్​ ఇవ్వని కేసీఆర్​ హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ ఇంటికే వస్తాడని, అలాంటి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యుడు కేడేం లింగమూర్తి, పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు బంక చందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ పాల్గొన్నారు.