కోర్టులకు కొత్త భవనాలు..నస్పూర్లో ఐదెకరాల్లో కాంప్లెక్స్ నిర్మాణం

కోర్టులకు కొత్త భవనాలు..నస్పూర్లో ఐదెకరాల్లో కాంప్లెక్స్ నిర్మాణం
  • శంకుస్థాపన చేసిన హైకోర్టు చీఫ్​జస్టిస్​
  • ఏడాదిన్నరలో​ అందుబాటులోకి..

మంచిర్యాల, వెలుగు: ఇరవై ఏండ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న మంచిర్యాల జిల్లా కోర్టులకు మరో ఏడాదిన్నరలో కొత్త బిల్డింగులు అందుబాటులోకి రానున్నాయి. నస్పూర్​లోని ఐడీఓసీ సమీపంలో ఐదెకరాల్లో ఇంటిగ్రేటెడ్​కోర్టు కాంప్లెక్స్​ నిర్మాణానికి శనివారం హైకోర్టు చీఫ్​జస్టిస్​అపరేశ్​ కుమార్​సింగ్​ హైదరాబాద్​ నుంచి వర్చువల్​గా శంకుస్థాపన చేశారు. 

జిల్లా అడ్మినిస్ట్రేటివ్​జడ్జి నగేశ్​ భీమపాక, ప్రిన్సిపల్​ డిస్ట్రిక్ట్​ అండ్ సెషన్స్​జడ్జి ఎ.వీరయ్య, కలెక్టర్​ కమార్​ దీపక్, డీఎఫ్​వో శివ్​ ఆశిష్​ సింగ్, బార్​అసోసియేషన్​ ప్రెసిడెంట్​బండవరపు జగన్, జనరల్​ సెక్రటరీ కె.మురళీకృష్ణతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమిపూజలో పాల్గొన్నారు. సీజే మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయస్థాన సేవలు అందించనున్నట్లు తెలిపారు.

2027 జూన్ నాటికి.. 

నస్పూర్​లోని సర్వే నంబర్​42లో మూడేండ్ల కిందట అప్పటి కలెక్టర్​ భారతి హోళికేరి 5 ఎకరాల 4 గుంటల గవర్నమెంట్​ ల్యాండ్​ను కోర్టు కాంప్లెక్స్ కోసం కేటాయించారు. ఆ జాగపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఆలస్యం జరిగింది. హైకోర్టులో కేసు వీగిపోవడంతో ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. జిల్లా కోర్టుల నిర్మాణానికి రూ.81 కోట్లు మంజూరు చేయగా, హైదరాబాద్​కు చెందిన ఓ ప్రైవేట్​కన్​స్ట్రక్షన్ ​కంపెనీ టెండర్​ దక్కించుకుంది. 

ప్రస్తుతం జిల్లాలో పది కోర్టులు ఉన్నాయి. మరో మూడు కోర్టుల కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్​ వెళ్లాయి. దీంతో ఈ సముదాయంలో మొత్తం 12 కోర్టు భవనాలను నిర్మిస్తున్నారు. అలాగే జ్యుడీషియల్​ఆఫీసర్స్​ క్వార్టర్స్​ కోసం ఎకరం స్థలాన్ని కలెక్టర్ ​కుమార్​ దీపక్ ​కేటాయించారు. మరో ఎకరంన్నర జాగా త్వరలోనే కేటాయిస్తామన్నారు. ఈ భవనాలు వచ్చే 2027 జూన్​​లోగా అందుబాటులోకి రానున్నాయి. 

తీరనున్న సమస్యలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిపాలన సౌలభ్యం కోసం 2004లో మంచిర్యాలలో మొదటి కోర్టు ఏర్పాటైంది. ఆ తర్వాత క్రమంగా కోర్టుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2022లో జిల్లా కోర్టులను విభజించారు. కానీ వాటికి సొంత భవనాలు లేకపోవడంతో స్థానిక మారుతినగర్​లోని ప్రైవేట్​బిల్డింగుల్లో నిర్వహిస్తున్నారు. దీంతో కోర్టులకు సొంత భవనాలు నిర్మించాలని న్యాయవాదులు గత 20 ఏండ్లుగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో మొదట మంచిర్యాల రాముని చెరువు సమీపంలో ఎకరం 10 గుంటల స్థలాన్ని కేటాయించారు. 

అది ఎఫ్ టీఎల్​ పరిధిలోకి వస్తుందని ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం తెలిపారు. తరువాత కాలేజీ రోడ్​లోని భూదాన్​ భూముల్లో ఐదెకరాలు కేటాయించారు. అది గోదావరి పరివాహక ప్రాంతం కావడం, భవన నిర్మాణాలకు సాయిల్​అనుకూలంగా లేకపోవడంతో బ్రేక్​పడింది. ఇలా అనేక అడ్డంకులను దాటుకుంటూ ఎట్టకేలకు ఇంటిగ్రేటెడ్​ కోర్టు బిల్డింగుల నిర్మాణం జరుగుతుండడంతో న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఆనందంగా ఉంది 

మంచిర్యాలలో ప్రస్తుతం పది కోర్టులు ఉన్నాయి. మరో మూడు కోర్టుల కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్​వెళ్లాయి. గత ఇరవై ఏండ్లుగా కోర్టు భవనాల కోసం న్యాయవాదులు పోరాడుతున్నారు. స్థల సమస్యలతో ఇన్నాళ్లు ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇంటిగ్రేటెడ్​ కోర్టు బిల్డింగ్స్​కు శంకుస్థాపన జరగడం ఆనందంగా ఉంది. మరో ఏడాదిన్నరలో కోర్టు భవన సముదాయం అందుబాటులోకి రానుంది.-  బండవరపు జగన్​, బార్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​