- విరిగిన సబ్ ఇన్స్పెక్టర్ కాలు, తలకు తీవ్ర గాయాలు
- పోలీసుల అదుపులో నిందితులు
వికారాబాద్ జిల్లా, వెలుగు: కారులో గంజాయి .. ముందు చూస్తే పోలీసులు..దీంతో ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో పోలీసులను కారుతో ఢీకొట్టి పరార్ కావడానికి ప్రయత్నించారు నలుగురు వ్యక్తులు.ఈ ఘటనలో ఓ ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. వికారాబాద్కు 4 కిలోమీటర్ల దూరంలోని అనంతగిరి కొండల్లో గురువారం తెల్లవారుజామున ఈ ఇన్సిడెంట్ జరిగింది. వికారాబాద్ నుంచి తాండూరు రూట్లో డ్రంకెన్ డ్రైవ్ చేస్తున్నారన్న సమాచారంతో నవాబుపేట ఎస్ఐ కృష్ణ సిబ్బందితో కలిసి నందిఘాట్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ టోలీచౌకికి చెందిన అన్వర్, నవీత్, సమీర్, ఇమ్రాన్లు టీఎస్ 07 యూహెచ్ 0381 నంబర్ కారులో గంజాయితో వికారాబాద్ నుంచి కెరెల్లి వైపు వెళ్తున్నారు. పోలీసులను చూసి ఆగిపోయారు. ముందుకు వెళితే దొరికిపోతామనే భయంతో వెహికల్ లైట్లను ఆఫ్ చేశారు. వీరిని చూసిన ఎస్ఐ కృష్ణ, సిబ్బంది ‘ఏయ్..కారు ఎందుకు ఆపారు’ అని ప్రశ్నిస్తూ వస్తుండగా స్పీడ్ పెంచి ఎస్ఐని ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయారు. సిబ్బంది కారును వెంబడించి పట్టుకున్నారు. చెక్ చేయగా 200 గ్రాములు గంజాయి దొరికంది. ప్రమాదంలో ఎస్ఐ కృష్ణ ఎడమ కాలు విరగడంతోపాటు తలకు తీవ్రంగా గాయమైంది. ఆయనను సికింద్రాబాద్లోని ఓ హాస్పిటల్లో చేర్చారు.
మీ ధైర్యానికి సెల్యూట్: డీజీపీ మహేందర్ రెడ్డి
గాయపడిన ఎస్ఐ శ్రీకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని డీజీపీ మహేందర్రెడ్డి ట్వీట్చేశారు. గురువారం విషయం తెలుసుకున్న డీజీపీ ‘ఎన్ని అవరోధాలు ఎదురైనా, ప్రమాదాలకు గురైనా, వ్యక్తిగతంగా నష్టం జరిగినా, మొక్కవోని ధైర్యం, విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను’ అని స్పందించారు.