ముంబై : దలాల్స్ట్రీట్లోకి మరో నాలుగు కంపెనీలు ఈ వారం అడుగుపెడుతున్నాయి. ఐపీఓల ద్వారా దాదాపు రూ.1,100 కోట్ల నిధులు సమీకరించనున్నాయి. వీటిలో ఒక ఎస్ఎంఈ ఇష్యూ కూడా ఉంది. మరికొన్ని కంపెనీల లిస్టింగ్స్ కూడా ఇదే వారంలో ఉన్నాయి.
జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్
ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో మెయిన్బోర్డ్ సెగ్మెంట్ నుంచి ఇది మొదటి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఇది జనవరి 9–-11 మధ్యకాలంలో సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. ఒక్కో షేరు ధర రూ. 315–-331. రూ. వెయ్యి కోట్ల ఐపీఓలో కంపెనీ తాజా ఇష్యూ మాత్రమే ఉంది. ఆఫర్- ఫర్ -సేల్ కాంపోనెంట్ లేదు. అందువల్ల, కంపెనీ మొత్తం ఇష్యూ ఆదాయాన్ని తన కోసం ఉపయోగించుకుంటుంది. రాజ్కోట్కు చెందిన ఈ మెటల్ -కటింగ్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ (సీఎన్సీ) మెషీన్ల తయారీదారు రూ. 475 కోట్లను అప్పులను తిరిగి చెల్లించడానికి, మరో రూ. 360 కోట్లను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఐపీఓ నిధులను ఉపయోగించుకుంటుంది.
ఐబీఎల్ ఫైనాన్స్
స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్ (ఎస్ఎంఈ) విభాగంలో ఐబీఎల్ ఫైనాన్స్ ప్రస్తుత సంవత్సరంలో మొదటి ఐపీఓ అవుతుంది. ఇది కూడా జనవరి 9–-11 మధ్య రూ. 33.4 కోట్లను సమీకరించడానికి సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. ఇది ఫిక్స్డ్ప్రైస్ ఇష్యూ. ఒక్కో షేరు ధరను రూ.51గా నిర్ణయించారు. ఈ ఫిన్టెక్ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫారమ్ ఐపీఓలో 65.5 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ మాత్రమే ఉంటుంది. భవిష్యత్ మూలధన అవసరాలను తీర్చడానికి టైర్-–1 మూలధన స్థావరాన్ని పెంచడానికి ఇది ఇష్యూకు వస్తోంది.
లిస్టింగ్: ఇదిలా ఉండగా, ఈ వారంలో కౌశల్య లాజిస్టిక్స్ మాత్రమే లిస్టింగ్ అవుతుంది. సంస్థ తన ఈక్విటీ షేర్లను జనవరి 8న ఎన్ఎస్ఈ ఎమర్జ్లో లిస్ట్ చేస్తుంది ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.75. రూ. 36.6 కోట్ల పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు ఇది 364.18 రెట్లు సబ్స్క్రయిబ్ అయింది.
న్యూ స్వాన్ మల్టీ టెక్ ఐపీఓ
ఈ వారం సబ్స్క్రిప్షన్ కోసం వస్తున్న మూడవ ఐపీఓ న్యూ స్వాన్ మల్టీటెక్. ఇది ప్రిసిషన్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ తయారీదారు. రూ.33.11 కోట్ల విలువైన ఈ ఐపీఓ జనవరి 11న ప్రారంభమై జనవరి 15న ముగుస్తుంది. అయితే ఆఫర్ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.62–-66గా నిర్ణయించారు. రయాన్, లుధియానా యూనిట్ల కోసం మెషినరీ కొనడానికి, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలతో పాటు అప్పులు చెల్లించడం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ డబ్బును వాడుతారు.
ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్
ఈ కంపెనీ మోనోక్రిస్టలైన్ పాలీక్రిస్టలైన్ సోలార్ మాడ్యూల్స్ మేకర్. ఇదే వారంలో రూ. 28 కోట్ల పబ్లిక్ ఇష్యూని కూడా ప్రారంభించనుంది. ఇది బుక్ -బిల్డింగ్ ఇష్యూ. ఆఫర్ జనవరి 11న మొదలై, జనవరి 15న ముగుస్తుంది. ఒక్కో షేరు ధరను రూ. 51-–54 మధ్య నిర్ణయించారు. ఇందులో తాజా ఇష్యూ మాత్రమే ఉంటుంది. ఓఎఫ్ఎస్ భాగం ఉండదు. కంపెనీ తన మూలధన వ్యయం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం నిధులను వాడుతుంది.