
ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు మరోసారి ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ సీజన్ లో అభిమానులని తీవ్రంగా నిరాశపర్చిన సన్ రైజర్స్.. ఎట్టకేలకు చివరి మ్యాచ్ లో తమ పునర్వైభవాన్ని చూపించింది. ఫామ్ లో లేని కోల్కతా బౌలర్లపై దారుణంగా విరుచుకుపడుతూ ఐపీఎల్ చరిత్రలో మరో అతి పెద్ద టోటల్ ను నమోదు చేసింది. ఆదివారం (మే 25) కోల్కతా నైట్ రైడర్స్ పై సన్ రైజర్స్ బ్యాటింగ్ లో పూనకం వచ్చినట్టు ఆడారు.
క్లాసన్ శివాలెత్తి కేవలం 37 బంతుల్లోనే సెంచరీ (39 బంతుల్లో 105: 7 ఫోర్లు, 9 సిక్సర్లు) చేయడంతో పాటు ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76: 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసంతో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో రికార్డులు బ్రేక్ చేయాలన్నా..కొత్త రికార్డులు సెట్ చేయాలన్నా తమకే సాధ్యమని సన్రైజర్స్ మరోసారి చాటి చెప్పింది.
రికార్డులు బ్రేక్ చేయాలన్నా... కొత్త రికార్డులు సెట్ చేయాలన్నా తమకే సాధ్యమని సన్రైజర్స్ మరోసారి చాటి చెప్పింది. గత సీజన్ లో ఉప్పల్లో పరుగుల ఉప్పెన సృష్టిస్తూ 277/3 స్కోరు చేసిన రైజర్స్ అదే సీజన్ లో మరో పది రన్స్ ఎక్కువ చేసి 287/3 స్కోరుతో సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో తమ రికార్డును తానే బ్రేక్ చేసి మెగా లీగ్లో అత్యధిక స్కోరు సాధించింది.
ఇక ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు.. ఈ సీజన్ చివరి మ్యాచ్ లో నేడు 3 వికెట్లకు 278 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో టాప్-4 అత్యధిక స్కోర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టువే కావడం విశేషం.