- ఫాక్స్కాన్ ప్రకటన
న్యూఢిల్లీ: వేదాంతతో కలిసి ఏర్పాటు చేసిన చిప్ తయారీ జాయింట్ వెంచర్ (జేవీ) నుంచి వైదొలిగినట్లు ప్రకటించిన ఫాక్స్కాన్, సెమీకండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ ప్రోగ్రామ్ కింద ఇన్సెంటివ్స్ కోసం సొంతగా దరఖాస్తు చేస్తామని తెలిపింది. ప్లాంటు ఏర్పాటుకు సరైన భాగస్వాముల కోసం వెతుకుతున్నట్లు ఈ తైవానీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తెలిపింది. వేదాంతతో ఉన్న 19.5 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ జేవీ నుంచి ఫాక్స్కాన్ వైదొలిగిన మరునాడే ఈ ప్రకటన వచ్చింది. "భారతదేశం నుంచి, విదేశాల నుంచి పార్ట్నర్లను మేం స్వాగతిస్తున్నాం. మాకు ఇప్పటికే ఉన్న ప్రపంచ-స్థాయి సప్లై చెయిన్ మేనేజ్మెంట్, తయారీ సామర్థ్యాలు ఎంతో మేలు చేస్తాయి. సెమీ కండక్టర్ ప్లాంటును ఇండియాలోనే పెడతాం. సెమీకండక్టర్స్ డిస్ప్లే ఫ్యాబ్ ఎకోసిస్టమ్ కోసం రూపొందించిన కొత్త ప్రోగ్రామ్కు సంబంధించిన అప్లికేషన్ను సమర్పించే దిశగా కృషి చేస్తున్నాం” అని ఫాక్స్కాన్ తెలిపింది. ఇండియా బలమైన సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్ను నిర్మించడానికి సిద్ధమవుతోందని పేర్కొంది. అయితే ఇందుకు సమయం పడుతుందని పేర్కొంది. ఫాక్స్కాన్ 2006లో భారతదేశంలోకి ప్రవేశించింది.
వేదాంతతో ఉన్న జేవీ నుంచి వైదొలగాలని తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ, రెండు పార్టీలు విడిపోవడానికి పరస్పరం అంగీకరించాయని తెలిపింది. జేవీ ప్రాజెక్ట్ తగినంత వేగంగా కదలడం లేదని రెండు వైపుల నుంచి గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఒకదేశంలో మొదటిస్థాయి నుంచి ఫ్యాబ్లను నిర్మించడం సవాలే అయినా, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. తాము 1980ల నుంచి ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఫాక్స్కాన్ తెలిపింది. మేక్ ఇన్ ఇండియాకు మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది. వేదాంత-, ఫాక్స్కాన్ సెమీకండక్టర్ మిషన్కు, మేక్ -ఇన్ -ఇండియా కార్యక్రమానికి కట్టుబడి ఉన్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీశాఖల సహాయమంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. వేదాంత జాయింట్ వెంచర్ నుంచి వైదొలగాలని ఫాక్స్కాన్ తీసుకున్న నిర్ణయం భారతదేశ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ టార్గెట్పై ఎటువంటి ప్రభావమూ చూపదని చంద్రశేఖర్ అన్నారు.