
- మెరిట్ ఆధారంగా స్టూడెంట్ల ఎంపిక
- నేటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ
మహబూబ్నగర్, వెలుగు: వెనుకబడిన పాలమూరు జిల్లాలో నిరుపేద పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు అడుగులు పడుతున్నాయి. టెన్త్, ఇంటర్ వరకే చదువుకొని.. ఆపై చదువులు చదువుకోవాలనుకుంటున్న వారి కలలు నెరవేరనున్నాయి. ఇందుకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులను సమకూర్చనున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జీకే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
ఈ అకడమిక్ ఇయర్ నుంచి క్లాసులు ప్రారంభమయ్యాయి. అయితే మహబూబ్నగర్ నియోజకవర్గంలోని పేదలు బీటెక్ చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన నియోజకవర్గంలో బీపీఎల్ కింద ఉన్న వంద మంది స్టూడెంట్లకు ఫ్రీగా ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించేందుకు ముందుకొచ్చారు. ఇందుకుగాను అప్లికేషన్లను ఆహ్వానించారు. గురువారం నుంచి ఈ అప్లికేషన్లను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, మహబూబ్నగర్ ఫస్ట్ ఆఫీసుల్లో అందుబాటులో ఉండనున్నాయి.
మెరిట్ ఆధారంగా ఎంపిక..
ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్లో చేరేందుకు మెరిట్ ఆధారంగా అవకాశం కల్పించనున్నారు. సీఎస్ఈ, ఏఐ అండ్ ఎంల్ కోర్సుల్లో చేరేందుకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్లో స్టూడెంట్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపర్చాలి. ఎప్ సెట్, జేఈఈ పరీక్షల్లో వచ్చిన ర్యాంక్, మార్కులను మెన్షన్ చేయాలి. ఇంటర్ హాల్ టికెట్ నంబర్, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారనే తేదీని, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు, పర్సంటేజీ వివరాలు పొందుపర్చాలి. అప్లికేషన్లో స్టూడెంట్తో పాటు తల్లిదండ్రులు లేదా గార్డియన్ సంతకం చేసిన డిక్లరేషన్ పొందుపర్చాలి. అప్లికేషన్లఆధారంగా వంద మందిని ఎంపిక చేసి, ఫ్రీగా ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేస్తారు.
ఒక్క స్టూడెంట్ ఫీజు రూ.2.76 లక్షలు..
ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తయింది. ప్రస్తుతం మేనేజ్మెంట్ కోటా కింద కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మేనేజ్మెంట్ కోటా కింద ఈ కోర్సుల్లో చేరేందుకు ఒక స్టూడెంట్ ఏడాదికి రూ.69 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా నాలుగేండ్లకు గాను రూ.2.76 లక్షలు కాలేజీ ఫీజుగా చెల్లించాలి. ఈ లెక్కల ప్రకారం వంద మంది స్టూడెంట్లను ఫ్రీగా చదివించేందుకు దాదాపు రూ.2.76 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇందులో కొంత మొత్తాన్ని ఎమ్మెల్యే సొంతంగా భరించనున్నారు. మిగతా డబ్బులు దాతల సహకారంతో సేకరించి విద్యార్థుల ఫీజును చెల్లించనున్నారు.
ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలన్నదే నా తాపత్రయం..
పాలమూరు జిల్లాను ఎడ్యుకేషన్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ హబ్గా డెవలప్ చేయాలన్నదే నా తాపత్రయం. అందు కోసం టాస్క్ సెంటర్ను ఏర్పాటు చేశాం. ఇటీవల అమరరాజా కంపెనీ ఆధ్వర్యంలో మరో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించాం. ఈ సెంటర్ ద్వారా మూడు నెలల్లో 200 మంది శిక్షణ తీసుకుంటారు. త్వరలో పాలమూరుకు పెద్ద కార్పొరేట్ సంస్థలు రానున్నాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇంట్రెస్ట్ఉన్న ప్రతి స్టూడెంట్ బీటెక్ చదవడానికి సహకారం అందిస్తాం. పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఈ సామాజిక కార్యక్రమంలో భాగం కావాలి.–యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే