- స్విస్, నార్వే, ఐస్ల్యాండ్, లిక్టున్స్టైన్తో ఇండియా ఒప్పందం
- వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా
- చరిత్రలో నిలిచిపోయే రోజు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: స్విస్ చాక్లెట్స్, వాచ్లు, బిస్కెట్లు వంటి ప్రొడక్ట్లు డొమెస్టిక్ కస్టమర్లకు తక్కువ రేటుకే దొరకనున్నాయి. స్విట్జర్లాండ్తో సహా యూరప్లోని నాలుగు దేశాలతో ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ( ఎఫ్టీఏ) కుదుర్చుకుంది. యురోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ) దేశాలు ఐస్ల్యాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లిక్టున్స్టైన్తో ఒప్పందాలు చేసుకుంది. అగ్రిమెంట్ను అమలు చేయడానికి కనీసం ఏడాది పట్టొచ్చు.
ఎఫ్టీఏ అమల్లోకి వస్తే ఈ దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై టారిఫ్లు వేయరు. అలానే మన దేశం నుంచి ఈ దేశాలకు ఎగుమతి అయ్యే ప్రొడక్ట్లపై కూడా టారిఫ్లు పడవు. టారిఫ్ యేతర అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఈ దేశాల్లో బిజినెస్ చేసుకోవడం కంపెనీలకు ఈజీగా మారుతుంది. తాజాగా కుదిరిన ఒప్పందాల వలన రానున్న 15 ఏళ్లలో ఇండియాలోకి 100 బిలియన్ డాలర్ల (రూ.8.30 లక్షల కోట్ల) విలువైన పెట్టుబడులు రానున్నాయి. 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అంచనా. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ఈ నాలుగు దేశాలతో 2008 లోనే చర్చలు మొదలయ్యాయి. కానీ, 2013 నవంబర్లో హోల్డ్లో పెట్టారు. 2016 అక్టోబర్లో చర్చలు మళ్లీ మొదలయ్యాయి. మొత్తం 21 రౌండ్ల పాటు చర్చలు జరిగాయి. ఫైనల్గా ఆదివారం ఎఫ్టీఏపై సంతకాలు చేశారు.
14 దేశాలతో ఎఫ్టీఏ
నాలుగు ఈఎఫ్టీఏ దేశాలతో కలుపుకొని ఇండియా ఇప్పటి వరకు 14 ఎఫ్టీఏలపై సంతకాలు చేసింది. 2014 తర్వాత మోదీ ప్రభుత్వం మారిషస్, యూఏఈ, ఆస్ట్రేలియాతో ఎఫ్టీఏ ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా ఐస్ల్యాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లిక్టున్స్టైన్లు ఈ లిస్ట్లో చేరాయి. ఈఎఫ్టీఏ దేశాలతో కుదిరిన ట్రేడ్ అగ్రిమెంట్ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్ చేశారు.
ఈ నాలుగు దేశాలు ఆర్ అండ్ డీ, ఇన్నొవేషన్లో టాప్లో ఉన్నాయని పేర్కొన్నారు. డిజిటల్ ట్రేడ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ మెషినరీ, బయోటెక్నాలజీ, ఫార్మా, కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి సెక్టార్లలో కలిసి పనిచేయడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ స్టేట్మెంట్ను ఈఎఫ్టీఏ దేశాల మినిస్టర్లు, అధికారుల ముందు యూనియన్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయెల్ చదివి వినిపించారు. కాగా, ఇండియా – ఈఎఫ్టీఏ దేశాల మధ్య 2022–23 లో 18.65 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం (రెండు వైపులు కలిపి) జరిగింది. 2021–22 లో 27.23 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఈఎఫ్టీఏ దేశాల్లో స్విట్జర్లాండ్ ఇండియాకు అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్. ఆ తర్వాత ప్లేస్లో నార్వే ఉంది.
ఎఫ్టీఏతో ఈ బెనిఫిట్స్..
1. ఇండియాలో తయారైన ప్రొడక్ట్ల (ఇండస్ట్రియల్)కు ఈఎఫ్టీఏ దేశాలైన ఐస్ల్యాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లిక్టున్స్టైన్లో ఎటువంటి సుంకాలు పడవు. అంతేకాకుండా అగ్రికల్చరల్ ప్రొడక్ట్లపై వేసే సుంకాల్లో రాయితీ ఉంటుంది. ఈఎఫ్టీఏలో పెద్ద దేశమైన స్విట్జర్లాండ్ ఈ ఏడాది జనవరి నుంచే ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇండస్ట్రియల్ ప్రొడక్ట్లపై సుంకాలు వేయడం లేదు.
2. మరోవైపు ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 95.3 శాతం ప్రొడక్ట్లపై ఇండియా టారిఫ్లు వేయదు. ఈ దేశాల నుంచి ఎక్కువగా గోల్డ్ను దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం దిగుమతులపై వేస్తున్న 15 శాతం కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం కొనసాగిస్తుంది. కానీ, బౌండ్ టారిఫ్ రేట్ (ఒక రకమైన ట్యాక్స్) ను ఒక శాతం తగ్గించి 39 శాతంగా నిర్ణయించింది.
3. ఫార్మా, మెడికల్ డివైజ్లు, ప్రొసెస్డ్ ఫుడ్ వంటి సెక్టార్లకు టారిఫ్లలో రాయితీలను ఇండియా ఆఫర్ చేస్తుంది. డెయిరీ, సోయా, బొగ్గు, కీలకమైన అగ్రికల్చరల్ ప్రొడక్ట్లపై ఎటువంటి టారిఫ్ రాయితీలను ఇవ్వడం లేదు.
4. ఐటీ, ఆడియో– విజువల్, ఆర్ అండ్ డీ వంటి సర్వీసెస్ సెక్టార్లలోని సబ్ సెక్టార్లలోకి ఈఎఫ్టీఏ దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్లు రానున్నాయి.