
మహారాష్ట్రలో మరో ఏడాదిలో లేడీ ఆర్టీసీ డ్రైవర్లు రాబోతున్నారు. ఇటీవల మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) నిర్వహించిన ‘డ్రైవర్ కమ్ కండక్టర్’ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో 150 మంది ఆడవాళ్లు సెలెక్టయ్యారు. వీళ్లందరికీ ఏడాది పాటు శిక్షణనిచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు. ఎంఎస్ఆర్టీసీ ఈ ఏడాది 8,022 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 35,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్షలో 30,068 మంది ఎంపికయ్యారు. వీళ్లలో 742 మంది మహిళలున్నారు.
సెలెక్టయిన ఆడవాళ్లలో 150 మంది డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో పాసయ్యారు. మహిళలను ప్రోత్సహించడానికి ఎంపిక విధానంలో ఆర్టీసీ సడలింపునిచ్చింది. మహిళలకు కేవలం లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఏడాది పాటు తేలికైన వాహనాలను నడిపిన అనుభవం ఉంటే చాలని పేర్కొంది. డ్రైవింగ్ టెస్ట్ నుంచీ మినహాయింపునిచ్చింది. మొదట తక్కువ దూరం నడిపించి, ఆ తర్వాత లాంగ్రూట్ డ్యూటీలు వేస్తామంటున్నారు అధికారులు.