రైతుల కోసం బరోడా కిసాన్​ రుణాలు

రైతుల కోసం బరోడా కిసాన్​ రుణాలు

హైదరాబాద్​, వెలుగు: బరోడా కిసాన్​ పక్​వాడా పేరుతో 15 రోజులపాటు రైతుల అవసరాల కోసం ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు బ్యాంక్​ ఆఫ్​ బరోడా (బీవోబీ) జనరల్​ మేనేజర్​ (హైదరాబాద్​ జోన్​) మన్​ మోహన్​ గుప్తా చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్​లలోని రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ట్రాక్టర్​, కార్లు, టూవీలర్లు ....ఇలా ఏదైనా రైతులకు అవసరమైన రుణాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రైతుల కోసం ఈ నెల 31దాకా15 రోజులలో దేశవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అగ్రి లోన్ల కోసం సెంటర్​ ఫర్​ అగ్రికల్చర్​ మార్కెటింగ్​ అండ్​ ప్రాసెసింగ్​ (సీఏఎంపీ)లను 16 జోన్లలోనూ బ్యాంకు ఏర్పాటు చేసిందని చెప్పారు. అగ్రి మార్కెటింగ్​లో చొరవతోపాటు, గతంలో లేని అగ్రికల్చర్​ లోన్లను తేవడానికి ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అగ్రికల్చర్​ లోన్లలో గోల్డ్​ లోన్​ సెగ్మెంట్​ కింద రూ. 650 కోట్లు, ఎస్​హెచ్​జీ సెగ్మెంట్​ కింద రూ. 54.96 కోట్లను 2021–22 లో  తాము అప్పులుగా ఇచ్చినట్లు వెల్లడించారు. రైతులకు సరయిన టైములో అప్పులు దొరికేలా బరోడా కిసాన్​ పక్​వాడాలో తమ జోన్​లోని బ్రాంచీలన్నీ చురుగ్గా పాల్గొంటున్నాయని, గత మూడేళ్లుగా బ్యాంకు ఈ బరోడా కిసాన్​ పక్​వాడా నిర్వహిస్తోందని డిప్యూటీ జోనల్​ మేనేజర్​ వినోద్​ బాబు వివరించారు. తెలంగాణలో బీవోబీకి 156 బ్రాంచీలున్నాయని వినోద్​ బాబు చెప్పారు.