చరిత్ర చాలా గొప్పది. తనలో చాలా దాచుకుంటుంది. ఎన్నో గొప్ప సంఘటనలు.. ఎందరో గొప్ప వ్యక్తులు.. పుటలు తిరిగేసేకొద్దీ ఎన్నెన్నో కొత్త విషయాలు. అవన్నీ సినిమాకి ముడి సరుకులే. చరిత్రను తవ్వి తెచ్చుకున్న ప్రతి కథ కనులకు విందే. అందుకే ఇప్పటికీ హిస్టారికల్ సినిమాలు తెరకెక్కుతూనే ఉన్నాయి. త్వరలో మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తమకు తెలియని విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి జనానికి. అందుకే హిస్టారికల్ ఫిల్మ్స్ అంటే ఇష్టపడతారు. దాన్నే మన ఫిల్మ్ మేకర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. చరిత్ర నుంచి ఎన్నో సంఘటనల్ని బైటికి తీసి సినిమాలుగా మలుస్తున్నారు. రీసెంట్గా వచ్చిన ‘మరక్కార్’.. పదహారో శతాబ్దంలో క్యాలికట్ మీద విదేశీయుల దాడి ఆధారంగా తెరకెక్కింది. గతంలో జెనీలియా, ప్రభుదేవా, పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ‘ఉరుమి’ కూడా ఇలాంటి కాన్సెప్ట్తోనే వచ్చింది. బ్రిటిష్ వారి పాలనలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా లగాన్, రంగ్దే బసంతి, ఎ పాసేజ్ టు ఇండియా లాంటి చిత్రాలొచ్చాయి. అప్పట్లో జరిగిన తిరుగుబాటులు, పోరాటాలు కేసరి, మంగల్ పాండే లాంటి చాలా సినిమాలకి ఇన్స్పిరేషన్. వీటిలో కొన్ని అచ్చంగా జరిగినదాన్నే చూపించాయి. కొన్నింటిని మాత్రం ఆయా సంఘటలకు ఫిక్షన్ని జోడించి తీశారు. త్వరలో రానున్న హరిహర వీరమల్లు, శ్యామ్ సింగరాయ్, 1945, రామసేతు, పొన్నియిన్ సెల్వన్ లాంటివి ఈ రెండో కోవకు చెందినవే.
కొందరు ఉన్నది ఉన్నట్టు తీస్తారు. కొందరు ఉన్నదాన్ని అందరికీ నచ్చేలా కాస్త మార్చి తీస్తారు. ఎలా తీసినా ప్రేక్షకుడి మనసు గెల్చుకోవడమే ప్రతి ఫిల్మ్ మేకర్ లక్ష్యం. అది నెరవేరితే సినిమా హిట్. లేదంటే ఫట్. ఎక్కువసార్లు మొదటిదే జరిగింది, జరుగుతోంది. అందుకే హిస్టారికల్ సినిమాల హవా ఇప్పటికీ నడుస్తోంది.
వ్యక్తులూ భాగమే!
చరిత్రంటే సంఘటనలే కాదు.. వ్యక్తులు కూడా. అందుకే బయోపిక్స్ని హిస్టారికల్ మూవీస్లో భాగంగా చూడొచ్చు. ఎందుకంటే వారి జీవిత కథను చెప్పేటప్పుడు కొన్ని సంఘటనల్ని కూడా చెప్పాలి. వాటిని చరిత్రలోంచే బైటికి తీయాలి. ఇప్పటికే ఆ ప్రయత్నం చాలామంది ఫిల్మ్ మేకర్స్ చేశారు. గౌతమీపుత్ర శాతకర్ణి, అశోకుడు, చంద్రగుప్తుడు, రుద్రమదేవి, పద్మావతి లాంటి రాజులు, రాణులు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి స్వాతంత్ర్య సమరయోధులు.. ఆదిశంకరాచార్య, రామదాసు లాంటి ఆధ్మాత్మికవేత్తలు.. ఎన్టీఆర్, జయలలిత లాంటి రాజకీయ నాయకులు.. చాణక్యుడు, శకుంతలాదేవి, ఆనంద్ కుమార్ లాంటి మేధావులు.. మేరీ కోమ్, మిల్కా సింగ్, ధోని లాంటి క్రీడాకారులు.. ఇలా ఎందరో వ్యక్తుల జీవితాలను సెల్యులాయిడ్ పైకి చేర్చారు. త్వరలో కపిల్ దేవ్ (83), సందీప్ ఉన్నికృష్ణన్ (మేజర్), పృథ్వీరాజ్, మహావీర కర్ణ, బింబిసార, మిథాలీ రాజ్ తదితరుల జీవిత కథలూ వస్తున్నాయి.
చరిత్ర అనగానే రాజులు, రాణుల కాలానికో లేక ఇండిపెండెన్స్ రాని రోజులకో వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. గడిచిన కాలమేదైనా చరిత్రే. అందుకే రీసెంట్గా జరిగిన సంఘటనలు కూడా సినిమాలుగా వస్తున్నాయి. ‘హోటల్ ముంబై’లో తాజ్ హోటల్పై జరిగిన దాడిని, ‘ఘాజీ’లో నీటి అడుగున పాకిస్థాన్తో జరిగిన యుద్ధాన్ని , ‘ఎయిర్లిఫ్ట్’లో కువైట్పై ఇరాక్ దాడిని, ‘బెల్బాటమ్’లో ఫ్లైట్ హైజాక్ని అడ్డుకున్న విధానాన్ని కళ్లకు కట్టారు. ఇవన్నీ మరుగున పడిపోయిన విషయాలు కాదు. అందరి మనసుల్లో మెదులుతున్నవే. అలాగే వ్యక్తులు కూడా. కార్గిల్ వార్లో వీర మరణం పొందిన విక్రమ్ బాత్రా లాంటి వారు ఈ తరానికి తెలిసినవారే అయినా వారి జీవితాలపై కూడా సినిమాలు వచ్చాయి.
‘ఆర్ఆర్ఆర్’ తీరే వేరు
చరిత్ర ఎప్పుడూ నిజాలే చెబుతుంది. వాటిని పక్కదారి పట్టించకుండా తెరకెక్కించడం ఓ పెద్ద చాలెంజ్. సినిమాటిక్ లిబర్టీ అంటూ లేనివి జోడిస్తే విమర్శలు తప్పవు. అలాంటిది ఏకంగా ఇద్దరు వీరుల చరిత్రని ఫిక్షనలైజ్ చేశాడు రాజమౌళి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమురం భీమ్లను తన ఊహల్లో తనకి నచ్చినట్టుగా సృష్టించుకున్నాడు. వారి జీవితాల్ని తన ఆలోచనలకు తగ్గట్టుగా రాసుకున్నాడు. ఎన్టీఆర్, రామ్చరణ్ లాంటి స్టార్ హీరోలను ఆయా పాత్రల్లో ప్రవేశపెట్టి, చరిత్రను తన స్టైల్లో తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి జక్కన్న చెక్కిన కొత్త చరిత్ర ఎలా ఉంటుందో జనవరి 7న వెండితెరపై చూడాల్సిందే.
చరిత్రలో ప్రేమకథలకు కొదవే లేదు. వాటి ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు తిరుగూ లేదు. లైలా మజ్ను, ముఘల్ ఎ అజమ్, జోధా అక్బర్, బాజీరావ్ మస్తానీ, రోమియో జూలియెట్ లాంటి ఎందరో అమర ప్రేమికులుగా చరిత్రలో నిలిచిపోయారు. వారందరి కథల్లో బలమైన ఎమోషన్ ఉంటుంది. అది సినిమాకి ఆయువు పట్టు అవుతుంది. అందుకే వారి కథల్ని ఫిల్మ్ మేకర్స్ తమదైన శైలిలో అందమైన సినిమాలుగా మలిచారు. చక్కని విజయాలు అందుకున్నారు.
మార్పు మంచిదేనా!
హిస్టారికల్ ఫిల్మ్స్ విషయంలో ఎక్కువగా వచ్చే సమస్య.. చరిత్రను వక్రీకరించారు అనేదే. హృతిక్ రోషన్ హీరోగా ‘మొహంజొదారో’ మూవీ వచ్చింది. అది వాస్తవాలకు దూరంగా ఉందని, ఆనాటి పరిస్థితుల్ని చూపించడంలో దర్శకుడు ఫెయిలయ్యాడని విమర్శలు వచ్చాయి. షారుఖ్ ఖాన్ ‘అశోకా’ సినిమాలో అతని ప్రేమకథని హైలైట్ చేయడం చాలామందికి కోపం తెప్పించింది. చరిత్రలో ఎక్కడా కనిపించనిది సినిమాలో పెట్టారనే కామెంట్స్ విని పించాయి. ఇక ‘పద్మావతి’ అయితే థియేటర్లకు రావడానికి నానా కష్టాలూ పడింది. ‘ద లెజెండ్ ఆఫ్ భగత్సింగ్’ సినిమా ఎన్నో కట్స్ తర్వాత బైటికొచ్చింది. బ్లాక్ ఫ్రైడే, మద్రాస్ కేఫ్, లక్ష్మీస్ ఎన్టీఆర్, మహానటి లాంటి సినిమాలన్నీ సమస్యల్ని ఎదుర్కొన్నవే. అంతెందుకు.. మొన్నటికి మొన్న వచ్చిన ‘ఎన్టీఆర్’ బయోపిక్లో కూడా సినిమాటిక్ లిబర్టీ ఎక్కువయ్యిందని చాలామంది అన్నారు. రీసెంట్గా వచ్చిన జయలలిత జీవిత కథ ‘తలైవి’ విషయంలోనూ కొందరు పెదవి విరిచారు. త్వరలో రానున్న సన్నీ లియోన్ ‘వీర మహాదేవి’ చిత్రాన్నైతే మహారాష్ట్ర వాసులు అడుగడుగునా అడ్డుకుంటూనే ఉన్నారు. ఓ పవిత్రమూర్తి పాత్రకి సన్నీని తీసుకోవడమే వారి అభ్యంతరానికి కారణం. జరిగిన దాన్ని జరిగినట్టు చూపించనప్పుడు చరిత్రను, అందులోని గొప్ప వ్యక్తులను టచ్ చేయవద్దనేది చాలామంది అనేమాట. అయితే మరీ ‘రా’గా చూపిస్తే ప్రేక్షకులు చూడరు కనుక కాస్త ఫ్రీ హ్యాండ్ తీసుకుంటాం, కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్స్ చేస్తాం అనేది ఫిల్మ్ మేకర్స్ చెప్పే మాట. ఇలాంటి మార్పు మంచిదేనా అనే విషయంలో ఇప్పటికీ వాదనలే జరుగుతున్నాయి తప్ప క్లారిటీ రాలేదు.
కొత్తకొత్తగా..
ఓవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే హీరోల సరసన గ్లామరస్ హీరోయిన్గా కనిపిస్తోంది కీర్తి సురేష్. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘సర్కారువారి పాట’ చేస్తున్న ఆమె.. త్వరలో విజయ్తో కూడా జోడీ కట్టనుందనే వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో విజయ్ హీరోగా తెరకెక్కనున్న తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీలో ఆమె నటిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాంతో విజయ్ టీమ్ రియాక్టయ్యింది. తమ చిత్రంలో హీరోయిన్ని ఇంకా ఫైనల్ చేయలేదని, కీర్తిని సెలెక్ట్ చేశారనే వార్త కేవలం పుకారని వాళ్లు తేల్చేశారు.
మోహన్లాల్ హీరోగా బి.ఉన్నికృష్ణన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆరట్టు’. ఈ యాక్షన్ డ్రామా ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. నిన్నటితో మోహన్లాల్ డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశారు. రీసెంట్గా వచ్చిన భారీ ప్యాన్ ఇండియా చిత్రం ‘మరక్కార్’ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో, లాల్ ఫ్యాన్స్ అందరూ ‘ఆరట్టు’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.
సౌత్లో సక్సెస్ అయిన హీరోయిన్లంతా నార్త్కి వెళ్లాలని ఆశపడటం కామన్. అలా చాలామంది వెళ్లారు కూడా. ఇప్పుడు రాశీఖన్నా కూడా బాలీవుడ్లో తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆల్రెడీ రెండు వెబ్ సిరీసులు చేస్తోంది. ఇప్పుడో ప్రెస్టీజియస్ మూవీలో చోటు సంపాదించింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా పుష్కర్ ఓఝా, సాగర్ ఆంబ్రేల దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మిస్తున్న యాక్షన్ ఫ్రాంచైజీ ‘యోధ’లో హీరోయిన్గా నటిస్తోంది. దిశా పటాని మరో హీరోయిన్. వచ్చే యేడు నవంబర్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది.
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘రన్వే 34’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టు నిన్న అజయ్ దేవగన్ ప్రకటించాడు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 29న సినిమాని విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఎయిర్లైన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. అజయ్, రకుల్ పైలట్లుగా కనిపించనున్నారు. అమితాబ్ ఎయిర్లైన్స్ అధికారి పాత్ర పోషిస్తున్నారు.