హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వేసవి వానలు దండిగా పడినై. సమ్మర్ సీజన్ లో కురవాల్సిన సాధారణం కన్నా భారీగా వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా రికార్డయింది. 32 జిల్లాల్లో అత్యంత అధిక (లార్జ్ ఎక్సెస్) వర్షపాతం రికార్డవగా.. ఒక్క నల్గొండ జిల్లాలో మాత్రం అధిక (ఎక్సెస్) వర్షపాతం నమోదయింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఒక రిపోర్టును విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 22 దాకా 14.61 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మామూలుగా అయితే సమ్మర్ సీజన్లో కురవాల్సిన వర్షాలు 5.48 సెంటీమీటర్లే. అయితే సగటు కన్నా 167 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో అత్యధికంగా 23.45 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటు వర్షపాతంతో పోలిస్తే ఇది 274 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఆ తర్వాత జనగామ జిల్లాలో 22.34 సెంటీమీటర్లు (274 శాతం), మహబూబాబాద్లో 21.89 (236 శాతం), కామారెడ్డిలో 20.49 (256 శాతం), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19.98 (159 శాతం) సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అతి తక్కువగా నల్గొండ జిల్లాలో 6.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది కూడా ఆ జిల్లా సగటుతో పోలిస్తే ఎక్కువే కావడం గమనార్హం.తెల్లవారుజామున భారీ వాన రాష్ట్రంలోని 20 జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.
హైదరాబాద్లో భారీ వర్షం పడింది. పలు చోట్ల గాలి దుమారంతో వానలు పడ్డాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 6.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా వెల్గటూరులో 5.9, కరీంనగర్ జిల్లా గుండిలో 5.5, సంగారెడ్డి జిల్లా కడ్పాల్లో 5.4, నిర్మల్ జిల్లా జామ్లో 4.2, మంచిర్యాల జిల్లా తాండూర్లో 4.1, మెదక్ జిల్లా రేగోడ్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, నాగర్కర్నూల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నల్గొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లోనూ వర్షం కురిసింది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో 3.2, రామచంద్రాపురంలో 2.7, కుత్బుల్లాపూర్లో 2.5, మల్కాజిగిరిలో 2.3, ముషీరాబాద్, శేరిలింగంపల్లిలో 2, కూకట్పల్లి, ఉప్పల్లో 1.7, హయత్నగర్లో 1.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉష్ణోగ్రతలు తగ్గినయ్
వానలు పడుతుండడంతో ఉష్ణోగ్రతలు చాలా వరకు పడిపోయాయి. నిన్నటిదాకా 45 డిగ్రీలుగా రికార్డయిన టెంపరేచర్లు.. సడన్గా 43 డిగ్రీలకు తగ్గిపోయాయి. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, పెద్దపల్లి జిల్లా ముత్తారంలలో 43.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మంచిర్యాల జిల్లా కొండపూర్లో 43.7, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జంబుగ, కెరమెరి, కరీంనగర్ జిల్లా తంగులలో 43.4, నిర్మల్ జిల్లా తానూర్లో 43.3, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 43.2, మంచిర్యాల నీల్వాయిలో 43.1, ఆదిలాబాద్ అర్లిటిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలో గరిష్ఠంగా 40 డిగ్రీలు రికార్డయింది.