- 5 నెలల్లో 578 ఎకరాల కొనుగోలు
- హైదరాబాద్లోనూ ఇదే ట్రెండ్
న్యూఢిల్లీ: సిటీల్లో ఎక్కడైనా భూమి కనిపిస్తే రియల్టర్లు వెంటనే అక్కడ వాలిపోతున్నారు. దానిని దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకోవడం, వేర్హౌసింగ్, డేటా సెంటర్ స్థలానికి ఇంకా డిమాండ్ రావడం ఇందుకు కారణాలు. ప్రాపర్టీ డెవలపర్లు దేశవ్యాప్తంగా ల్యాండ్ పార్సెల్ల కోసం ఇది వరకుకంటే మరింత ఎక్కువగా వెతుకుతున్నారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ–-జాతీయ రాజధాని ప్రాంతం, పూణే, చెన్నై, హైదరాబాద్లోని కీలకమైన ప్రాపర్టీ మార్కెట్లలో జోరుగా లావాదేవీలు జరుగుతున్నాయి. కొందరు జాయింట్ వెంచర్గా ఏర్పడి, మరికొందరు సొంతంగా జాగాలను కొంటున్నారు. చాలా డీల్స్ త్వరలో పూర్తవుతాయని భావిస్తున్నారు. రియల్టీ రీసెర్చ్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ ఇండియా డేటా ప్రకారం, జనవరి 2022– మే 2023 మధ్య (17 నెలల్లో) రూ.26 వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన 104 వేర్వేరు ల్యాండ్ డీల్స్ పూర్తయ్యాయి. ఫలితంగా రియల్టీ డెవలపర్లు దాదాపు 2,181 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారు. ఈ ల్యాండ్ బ్యాంకుల విస్తీర్ణం సుమారు 209 మిలియన్ చదరపు అడుగులు ఉంటుంది. 2023 మొదటి ఐదు నెలల్లో దాదాపు 578 ఎకరాలు భూమి చేతులు మారింది. బ్రాండెడ్ డెవలపర్లు టాప్ మెట్రోలతో పాటు టైర్–2, టైర్-3 నగరాల్లో అనేక భూ లావాదేవీలను విజయవంతంగా ముగించారు. డిమాండ్ను తట్టుకునేలా బలమైన ప్రాజెక్ట్ పైప్లైన్ను డెవెలపర్లు అభివృద్ధి చేస్తున్నారు.
ముంబై.. నంబర్ వన్
ఎక్కువ లావాదేవీలు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ–ఎన్సీఆర్, చెన్నై, బెంగళూరులో జరిగాయి. మొత్తం లావాదేవీల్లో 72శాతం వాటా వీటిదే ఉంది. వీటిలో దాదాపు 1,576 ఎకరాలు అమ్ముడయ్యాయి. మొత్తం 79 ల్యాండ్ డీల్స్ ద్వారా 150 మిలియన్ చదరపు అడుగుల స్థలం డెవెలపర్లు చేతుల్లోకి వెళ్లింది. పూణే, కోల్కతా, హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లకు మొత్తం డీల్స్లో 9 శాతం వాటా ఉండగా, మిగిలిన మొత్తాన్ని సూరత్, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, నాగ్పూర్, పంచ్కుల, కురుక్షేత్ర వంటి నగరాలు అందించాయి. ఢిల్లీ–ఎన్సీఆర్, పానిపట్, గుర్గావ్లోని సబ్–మార్కెట్లలో గత 17 నెలల కాలంలో భారీగా క్రయవిక్రయాలు జరిగాయి. లావాదేవీల సంఖ్య పరంగా చూస్తే ఎంఎంఆర్, ఢిల్లీ–ఎన్సీఆర్లు 53 లావాదేవీలతో ముందంజలో ఉన్నాయి.