బాల్క సుమన్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం : గడ్డం వంశీకృష్ణ

బాల్క సుమన్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం :  గడ్డం వంశీకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు :  అక్రమంగా ఇసుకను అమ్ముకొని కోట్లు కొల్లగొడ్తున్న బాల్క సుమన్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ అన్నారు. బుధవారం మందమర్రిలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు నివాసంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నరకాసురుని వధకు గుర్తుగా దీపావళి జరుపుకుంటం.. ఈ స్ఫూర్తితో అభినవ నరకాసురిని తరిమివేయాలి. ఇందుకోసం ఈనెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి నీతి, నిజాయతీకి మారుపేరైన వివేక్​వెంకటస్వామిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.

 రోజు 200 ట్రక్కుల ఇసుకను అమ్ముకుంటున్న సుమన్.. కమీషన్ రూపంలో ఐదేండ్లలో వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. ఇక్కడ ఆయనకు రూ.2 కోట్లతో కాంట్రాక్టర్ పెద్ద ఇల్లు కట్టించాడని, హైదరాబాద్‌లో మరో  రూ.5 కోట్ల విలువైన ఇల్లు ఉందని, సుమన్​కు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చాయో జనం ఆలోచించాలన్నారు. 

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ లీడర్లకు నల్లాల ఓదెలుతో కలిసి పార్టీ కండువాలు కప్పి వంశీకృష్ణ ఆహ్వానించారు. సమావేశంలో కాం గ్రెస్ లీడర్లు రాఘునాథ్​రెడ్డి, సొత్కు సుదర్శన్​, బండి సదానందం తదితరులు పాల్గొన్నారు.