ఆలేరుకు ‘గోదారమ్మ’..రిజర్వాయర్​గా గంధమల్ల చెరువు

ఆలేరుకు ‘గోదారమ్మ’..రిజర్వాయర్​గా గంధమల్ల చెరువు
  • జూన్​  6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
  • మరికొన్ని అభివృద్ధి పనులకు ముహూర్తం 
  • తిర్మలాపురంలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదాద్రి, వెలుగు :  దశాబ్దాలుగా ఎదురు చూస్తోన్న ఆలేరు ప్రజల నిరీక్షణ ఫలించింది. గంధమల్ల రిజర్వాయర్​కు మోక్షం కలిగింది. ఆలేరును గోదారమ్మ తపడనుంది. ఈనెల 6న రిజర్వాయర్​నిర్మాణ పనులతో పాటు వివిధ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.  అనంతరం తుర్కపల్లి మండలం తిర్మలాపూర్​లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య .. తిర్మలాపూర్​ సభా స్థలిలో హెలిపాడ్, పార్కింగ్, శిలాఫలకాల ఏర్పాటు పనులను పరిశీలించారు. గంధమల్ల రిజర్వాయర్​ నిర్మాణం పూర్తైతే ఆలేరుకు గోదావరి జలాలు వస్తాయని ఆయన చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. 

అడుగు ముందుకు పడలే..

2018లో ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా  అప్పటి సీఎం కేసీఆర్.. ​గంధమల్ల రిజర్వాయర్​నిర్మించి ఆలేరును సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.  గోదావరి జలాల మళ్లింపు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీల్లో భాగంగా నిర్మిస్తామని ప్రకటించారు. రిజర్వాయర్​ను 9.8 టీఎంసీలతో నిర్మిస్తామని చెప్పారు. ఆ తర్వాత  4.28 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని ప్రతిపాదించారు. 2019 ఫిబ్రవరిలో భూ సేకరణ నోటిఫికేషన్​ జారీ అయింది.  రిజర్వాయర్​కు 2, 618 ఎకరాలు, కాల్వలకు 3,841 ఎకరాలను కలిపి మొత్తంగా 6,459 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు.  ఆ తర్వాత 1.5 టీఎంసీలతో నిర్మిస్తామని ప్రచారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ రిజర్వాయర్​పై అప్పటి సర్కారు అడుగు ముందుకు వేయలేదు. 

56 వేల ఎకరాలను సాగు నీరు 

ఆలేరు ప్రజలు ఏండ్ల తరబడి గంధమల్ల రిజర్వాయర్​ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు.  కేసీఆర్  హామీ ఇచ్చినా చివరకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్​సర్కారు వచ్చాక కరువు ప్రాంతమైన ఆలేరుపై దృష్టి సారించింది. ఎక్కువ ముంపు లేకుండా1.41 టీఎంసీల సామర్థ్యంతో గంధమల్ల రిజర్వాయర్​నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీని నిర్మాణానికి రూ. 700 కోట్లతో అంచనా వేసింది. రూ. 575.57 కోట్లు మంజూరు చేసింది. బండ్, సబ్​మెర్​జెన్సీ కోసం గంధమల్ల, వీరారెడ్డి పల్లి గ్రామాల నుంచి 993.77 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందులో గంధమల్ల చెరువు ప్రాంతంలోనే 112.15 ఎకరాలను తీసుకున్నారు.   నిర్మాణం పూర్తైతే ఆలేరు సెగ్మెంట్ పరిధిలోని 56 వేల ఎకరాలకు గోదావరి జలాలు అందనున్నాయి.