
- జూన్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
- మరికొన్ని అభివృద్ధి పనులకు ముహూర్తం
- తిర్మలాపురంలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదాద్రి, వెలుగు : దశాబ్దాలుగా ఎదురు చూస్తోన్న ఆలేరు ప్రజల నిరీక్షణ ఫలించింది. గంధమల్ల రిజర్వాయర్కు మోక్షం కలిగింది. ఆలేరును గోదారమ్మ తపడనుంది. ఈనెల 6న రిజర్వాయర్నిర్మాణ పనులతో పాటు వివిధ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తుర్కపల్లి మండలం తిర్మలాపూర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య .. తిర్మలాపూర్ సభా స్థలిలో హెలిపాడ్, పార్కింగ్, శిలాఫలకాల ఏర్పాటు పనులను పరిశీలించారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం పూర్తైతే ఆలేరుకు గోదావరి జలాలు వస్తాయని ఆయన చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు.
అడుగు ముందుకు పడలే..
2018లో ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్.. గంధమల్ల రిజర్వాయర్నిర్మించి ఆలేరును సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. గోదావరి జలాల మళ్లింపు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీల్లో భాగంగా నిర్మిస్తామని ప్రకటించారు. రిజర్వాయర్ను 9.8 టీఎంసీలతో నిర్మిస్తామని చెప్పారు. ఆ తర్వాత 4.28 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని ప్రతిపాదించారు. 2019 ఫిబ్రవరిలో భూ సేకరణ నోటిఫికేషన్ జారీ అయింది. రిజర్వాయర్కు 2, 618 ఎకరాలు, కాల్వలకు 3,841 ఎకరాలను కలిపి మొత్తంగా 6,459 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 1.5 టీఎంసీలతో నిర్మిస్తామని ప్రచారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ రిజర్వాయర్పై అప్పటి సర్కారు అడుగు ముందుకు వేయలేదు.
56 వేల ఎకరాలను సాగు నీరు
ఆలేరు ప్రజలు ఏండ్ల తరబడి గంధమల్ల రిజర్వాయర్ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. కేసీఆర్ హామీ ఇచ్చినా చివరకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్సర్కారు వచ్చాక కరువు ప్రాంతమైన ఆలేరుపై దృష్టి సారించింది. ఎక్కువ ముంపు లేకుండా1.41 టీఎంసీల సామర్థ్యంతో గంధమల్ల రిజర్వాయర్నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీని నిర్మాణానికి రూ. 700 కోట్లతో అంచనా వేసింది. రూ. 575.57 కోట్లు మంజూరు చేసింది. బండ్, సబ్మెర్జెన్సీ కోసం గంధమల్ల, వీరారెడ్డి పల్లి గ్రామాల నుంచి 993.77 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందులో గంధమల్ల చెరువు ప్రాంతంలోనే 112.15 ఎకరాలను తీసుకున్నారు. నిర్మాణం పూర్తైతే ఆలేరు సెగ్మెంట్ పరిధిలోని 56 వేల ఎకరాలకు గోదావరి జలాలు అందనున్నాయి.