మంచిర్యాల జిల్లా గాంధారి వనంలో ఆహ్లాదం నిల్!

మంచిర్యాల జిల్లా గాంధారి వనంలో ఆహ్లాదం నిల్!
  •     నీళ్లున్నా.. ఏండ్లుగా బోటింగ్​ సేవలు లేవు 
  •     పార్క్ నిర్వహణను పట్టించుకోని అటవీశాఖ
  •     విజ్ఞానం కలిగించే వృక్షజాతులు కనుమరుగు
  •     నేషనల్ హైవే నిర్మాణంతో ధ్వంసమైన పిల్లల పార్క్ 
  •     పునరుద్ధరించాలంటున్న పర్యాటకులు, జిల్లా వాసులు 

కోల్​బెల్ట్​,వెలుగు: మంచిర్యాల జిల్లా ప్రజలు సేదతీరేందుకు ఏర్పాటు చేసిన గాంధారి వనం పార్క్ లో ఆహ్లాదం కరువైంది. రూ.కోట్ల నిధులతో అభివృద్ధి చేయగా పార్క్​నిర్వహణపై అటవీశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి బొక్కలగుట్ట బ స్ స్టేజ్​వద్ద 2015లో 400 ఎకరాల నాచురల్​ఫారెస్ట్​లో గాంధారి వనం పేరుతో అర్బన్​పార్క్​ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏర్పాటైన అర్బన్​ పార్క్​లో మొదటిది.

 ఇందులో  స్మృతివనం, రాశీవనం, ఔషధవనం, పిల్లల ఆట వస్తువులు, వన భోజనాలకు అవసరమైన స్థలం, నర్సరీలోని నీటి కుంటలో బోటింగ్, వందలాది రకాల వృక్షజాలం, ఫాజిల్స్, వాకింగ్ ట్రాక్​,సేదతీరేందుకు షెడ్డు  నిర్మించారు.  బెంచీలు, యోగ షెడ్డు,సైకిల్లింగ్​ కోసం అందుబాటులో సైకిల్స్​ను కూడా ఉంచారు.  50ఎకరాల స్థలంలో జింకల సంరక్షణ కేంద్రం, రాష్ట్ర చిహ్నాలను ఏర్పాటు చేశారు. ఇటీవల మరో రెస్ట్​హాల్, రెండు కొత్త నీటి కుంటలను, డ్రికింగ్​వాటర్​కోసం ఆర్వో ప్లాంట్, టాయిలెట్స్ అందుబాటులోకి తెచ్చారు. అయితే పర్యాటకులు, జిల్లా వాసులకు పూర్తిస్థాయి ఆహ్లాదాన్ని అందించడంపై ఆఫీసర్లు దృష్టి పెట్టడంలేదు.  

ఏండ్లుగా నిలిచిన బోటింగ్​సేవలు 

గాంధారీవనం అర్బన్​పార్కులోని నీటి కుంటలో నీళ్లు అడుగంటిపోవడంతో 2017లో పర్యాటకులు, జిల్లా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించిన బోటింగ్​సేవలను నిలిపివేశారు. నీళ్ల కోసం బోరువేయడం కాని పక్కనే ప్రవహించే పాలవాగులోని నీళ్లను పైపులైను ద్వారా కుంటలోకి మళ్లించడంగానీ చేయలేదు. మొదట్లో బోటింగ్​సేవలపై పర్యాటకులు, జిల్లా వాసులు ఆసక్తి చూపడంతో అటవీశాఖ భారీగా ఆదాయాన్ని ఆర్జించింది.

 9 ఏండ్ల కింద నీళ్లు లేవని సాకు చూపుతూ బోటింగ్​ సేవలను పూర్తిగా నిలిపివేశారు. కొన్నాళ్లుగా పార్కులోని నీటి కుంట నిండి కళకళలాడుతోంది. అయినా బోటింగ్​సేవల పునరుద్ధరణపై మాత్రం అటవీశాఖ ఆఫీసర్లు ఫోకస్ చేయడంలేదు. నామమాత్రపు ఫీజుతో పార్కులోకి అనుమతిస్తుండగా..  రిక్రియేషన్ ను పట్టించుకోవడంలేదు. వృక్షజాతులపై విజ్ఞానం కల్గించేలా ఏర్పాటు చేసిన పలు వనాలు కనుమరుగయ్యాయి.

 నేషనల్​హైవే –363 ఫోర్​లేన్​నిర్మాణంతో పిల్లల పార్కు పూర్తిగా ధ్వంసమైంది. తిరిగి దాన్ని కూడా పునరుద్ధరించలేదు. సైక్లింగ్​ఊసేలేదు. నీటి కుంట నిండడంతో గాంధారీవనం అర్బన్​పార్క్​లో నిలిచిన బోటింగ్​సేవలను తిరిగి ప్రారంభించాలని పర్యాటకులు, జిల్లా వాసులు డిమాండ్​చేస్తున్నారు.