- ఉమేష్పాల్ కిడ్నాప్ కేసులో ప్రయాగ్రాజ్ కోర్టు తీర్పు
- చెరో లక్ష చొప్పున జరిమానా
- ఇంకో ఏడుగురు నిర్దోషులుగా విడుదల
ప్రయాగ్రాజ్ : ఉమేష్పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్స్టర్అతీఖ్అహ్మద్, దినేశ్ పాసీ, ఖాన్ సౌలత్హనీఫ్లను యూపీలోని ప్రయాగ్ రాజ్లో ఉన్న ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు దోషులుగా తేల్చింది. ఆ ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. వారిపై చెరో రూ.లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. ఫైన్ ద్వారా వారి నుంచి సేకరించే మొత్తాన్ని ఉమేష్పాల్ కుటుంబానికి అందిస్తామని కోర్టు వెల్లడించింది. ఐపీసీ 364–ఏ సెక్షన్ కింద నేరాభియోగాలన్నీ నిరూపణ కావడంతో ముగ్గురికి కోర్టు జీవితఖైదు విధించిందని ప్రభుత్వ న్యాయవాది గులాబ్ చంద్ర అగ్రహారి తెలిపారు.
ఇక అతీఖ్ అహ్మద్ సోదరుడు అష్రఫ్ సహా మరో ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. అతీఖ్ అహ్మద్పై ఇప్పటివరకు 100కుపైగా పోలీసు కేసులు నమోదవగా.. వాటిలో అతడు దోషిగా తేలిన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. కోర్టు తీర్పును ప్రకటించిన అనంతరం అతీఖ్ అహ్మద్ ను నైనీ పట్టణంలోని జైలుకు తరలించారు. అక్కడ మీడియా ప్రతినిధులను చూసిన అతీఖ్.. ‘‘నాకు కోర్టులంటే గౌరవం.. ఇది తప్పుడు తీర్పు. నేను హైకోర్టుకు వెళ్తా” అని చెప్పాడు. అంతకుముందు మంగళవారం ఉదయం అతీఖ్ను ప్రయాగ్ రాజ్ కోర్టుకు తీసుకురాగానే.. అతడికి ఉరిశిక్ష విధించాలంటూ కొందరు న్యాయవాదులు నినాదాలు చేశారు.
2005 నుంచి ఇప్పటిదాకా..
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య జరిగింది. ఆ కేసులో ప్రధాన సాక్షిగా ఉమేష్ పాల్ఉన్నాడు. 2006లో ఉమేష్ పాల్ కిడ్నాప్ కు గురై విడుదలయ్యాడు. దీంతో 2007లో అతడు అతీఖ్అహ్మద్ సహా పలువురిపై కిడ్నాప్కేసు పెట్టాడు. ఈ కేసు విచారణ సంబంధించిన చివరి రోజున (ఈ ఏడాది ఫిబ్రవరి 24న) ఉమేష్ పాల్ ప్రయాగ్ రాజ్లోని తన ఇంటి వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. దీనిపై ఉమేష్ పాల్ భార్య జయా పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్, అతీఖ్ భార్య షాయిస్తా పర్వీన్, అతీఖ్ ఇద్దరు కొడుకులతో పాటు మరో 11 మంది కలిసి తన భర్తను మర్డర్ చేయించారని అభియోగాలు నమోదు చేసింది. 2007లో ఉమేష్ పాల్పెట్టిన కిడ్నాప్కేసు, ఇటీవల అతడి భార్య జయాపాల్ నమోదు చేసిన మర్డర్ కేసులను కలిపి విచారించిన ప్రయాగ్ రాజ్ న్యాయస్థానం తాజా తీర్పును వెలువరించింది.