భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ. 3.49 కోట్ల విలువైన గంజాయి పట్టివేత : భద్రాద్రి ఎస్పీ రోహిత్​ రాజు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ. 3.49 కోట్ల విలువైన గంజాయి పట్టివేత  : భద్రాద్రి ఎస్పీ రోహిత్​ రాజు
  • 698 కేజీల గాంజాతో పాటు ఆరుగురు అరెస్ట్ 
  • భద్రాద్రి ఎస్పీ రోహిత్​ రాజు వెల్లడి​ 

భద్రాద్రికొత్తగూడెం/టేకులపల్లి, వెలుగు :  గంజాయిని పార్సిల్స్ గా మార్చి తరలిస్తుండగా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకుని, ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఎస్పీ బి. రోహిత్​శనివారం మీడియాకు వివరాలు తెలిపారు. ఏపీలోని సీలేరు నుంచి హర్యానాలోని కురుక్షేత్రకు పార్సిల్ గా చేసుకుని ఐచర్ వ్యాన్​లో గంజాయిని తరలిస్తున్నారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ముత్యాలం క్రాస్​రోడ్డు వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా 698 కేజీల గంజాయి దొరికింది. దాని విలువ దాదాపు రూ. 3.49కోట్లు ఉంటుంది.

వ్యాన్​లోని ముగ్గురు వ్యక్తులతో పాటు దాన్ని కారులో వెంబడించే మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేశారు.  హర్యానా చెందిన నిందితులు సందీప్​కుమార్, లక్విందర్, అమర్​నాథ్, పవన్​కుమార్, రాజ్​కుమార్, కృష్ణన్​ కుమార్ అరెస్ట్ చేశారు.  గంజాయి కొనుగోలు చేసిన, అమ్మిన వ్యక్తులు హరిఖారా, ప్రిన్స్​కుమార్​పై కేసులు నమోదు చేశారు.  భారీగా గంజాయిని పట్టుకున్న టేకులపల్లి సీఐ టి. సురేష్​, ఎస్ఐ ఎ. రాజేందర్, సీసీఎస్​ ఇన్ స్పెక్టర్ రమాకాంత్​, ఎస్ఐలు ప్రవీణ్​ కుమార్​, రామారావు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.