వెలుగు బిజినెస్ డెస్క్:మొదట ఆయన ఆసియాలోనే సంపన్నుడిగా ఎదిగారు. ఆ తర్వాత ఆయన నెట్వర్త్ వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వంటి దిగ్గజాలను దాటేసింది. ఎవరో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది కదూ. ఆయనే అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ. తాజాగా ఆయన సంపద చాలా వేగంగా పెరగడంతో మూడో ప్లేస్లోని జెఫ్ బెజోస్ను కూడా వెనక్కి నెట్టేశారు. అంతేకాదు, రెండో ప్లేస్లోని బెర్నార్డ్ అర్నాల్ట్(154.5 బిలియన్ డాలర్లు) నూ దాటేసే ప్రయత్నంలో దూసుకెళ్తున్నారు. అర్నాల్ట్ సంపదకూ అదానీ ఇప్పటి సంపదకూ పెద్దగా తేడా కనబడటం లేదు. ఫోర్బ్స్ రియల్టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం గౌతమ్ అదానీ సంపద 148.3 బిలియన్ డాలర్లకు చేరింది. గత కొన్నేళ్లలోనే అదానీ నెట్వర్త్ రాకెట్ వేగంతో పెరగడం విశేషం. కిందటి ఏడాది కాలంలో చాలా మంది సంపన్నుల సంపద తగ్గుతుంటే అదానీ మాత్రం తన సంపదను భారీగా పెంచుకోవడం గమనించదగ్గది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ రేట్లు పెరగడం కూడా ఆయన సంపద పెరుగుదలకు సాయపడింది. ఎంఎస్సీఐ వరల్డ్ఎనర్జీ ఇండెక్స్ 2022లో ఏకంగా 36 శాతం రిటర్న్స్ను ఇచ్చింది.
కొన్ని షేర్లు 1000 శాతం పెరుగుదల....
అదానీ గ్రూప్లోని కొన్ని కంపెనీల షేర్లు ఈ ఏడాది రెట్టింపు కంటే ఎక్కువే పెరిగాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్ప్రైజస్, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు భారీగా జంప్ చేశాయి. 2020 నుంచి చూస్తే గ్రూప్లోని కొన్ని కంపెనీల షేర్లయితే ఏకంగా 1000 శాతం పెరగడం విశేషం. ఇదే కాలంలో సెన్సెక్స్ కేవలం 44 శాతం పెరిగింది.
3 గిగా ఫ్యాక్టరీలు పెడతాం..
సోలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్స్, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ తయారీ కోసం రూ.5.6 లక్షల కోట్ల (70 బిలియన్ డాలర్ల) తో మూడు గిగా ఫ్యాక్టరీలు పెట్టనున్నట్లు బుధవారం నాడు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. 2030 లోపే ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. వరల్డ్ టాప్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రొడ్యూసర్ లిస్టులో చేరడమే తమ టార్గెట్గా పేర్కొన్నారు. యూఎస్ఐబీసీ గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలిసిలికాన్ నుంచి సోలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్స్, హైడ్రోజన్ ఎలక్ర్టోలైజర్స్ను ఈ గిగా ఫ్యాక్టరీలు ఉత్పత్తి చేస్తాయని అదానీ పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్న 20 గిగా వాట్లకు అదనంగా మరో 45 గిగా వాట్లను తాము ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 2030 నాటికి 3 మిలియన్ టన్నుల హైడ్రోజన్ ప్రొడక్షన్ టార్గెట్ అందుకోనున్నట్లు చెప్పారు. అయిదవ గిగా ఫ్యాక్టరీ పెట్టనున్నట్లు ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
యూఎస్‑ఇండియా జీడీపీ 70 ట్రిలియన్ డాలర్లు...
2050 నాటికి అమెరికా, ఇండియాల జీడీపీ 70 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, ఇది గ్లోబల్ ఎకానమీలో 40 శాతానికి సమానంగా ఉంటుందని అదానీ పేర్కొన్నారు. అప్పటికి ఈ రెండు దేశాల జనాభా కూడా 2 బిలియన్లవుతుందని అన్నారు. అమెరికా–ఇండియాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 150 బిలియన్ డాలర్లేనని, దీనిని భారీగా పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు.