
శంషాబాద్, వెలుగు: నకిలీ ఏజెంట్ల మాటలు నమ్మి ఉద్యోగం ఆశతో ఇరాక్ వెళ్లి అక్కడ కష్టాలు పడుతున్న 16 మంది గల్ఫ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. శనివారం వీరంతా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ఏజెంట్ల మాటలు నమ్మి వీరంతా నాలుగేళ్ల క్రితం ఇరాక్ వెళ్లారు. అక్కడికెళ్లాక ఉద్యోగం లేకపోగా ఉండేందుకు కనీస వసతి కూడా లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దొరికిన పని చేస్తూ ఇన్నాళ్లూ ఎలాగోలా జీవితం నెట్టుకొచ్చారు. తిరిగి సొంతూరుకు వచ్చేందుకు చేతిలో డబ్బుల్లేకపోవడంతో.. తమ పరిస్థితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
దీనిపై స్పందించిన మంత్రి కేంద్ర ప్రభుత్వ అధికారులతోపాటు ఇరాక్లోని మనదేశ రాయబార కార్యాలయం, అక్కడి తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖతో మాట్లాడారు. దీంతో వారు16 మందికి ఫ్లైట్ టికెట్స్ కొని పెట్టడంతో వారంతా శనివారం తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో బాధితులు మాట్లాడుతూ.. తమ వినతికి స్పందించి సాయం చేసిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో వేగంగా స్పందించిన కేంద్రం, తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ అధికారి చిట్టిబాబును మంత్రి కేటీఆర్ అభినందించారు.