ఒకపక్క పొయ్యిపై పాలు పొంగుతుంటాయి. అంతలోనే ‘బ్రేక్ఫాస్ట్ రెడీనా ?’ అంటూ హాల్లోంచి ఒక అరుపు...టిఫిన్ చేతికిచ్చి కిచెన్లోకి వచ్చేసరికి కూర అడుగు అంటుతుంటుంది. ఆ హడావిడిలో ఉండగానే ‘అమ్మా! స్కూల్కి లేటు అవుతుంది. లంచ్ బాక్స్ ఇంకా అవ్వలేదా’? అంటూ పిల్లల కస్సుబుస్సులు. ఆ వెంటనే ఇల్లు సర్దాలి, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి. మళ్లీ ఈవెనింగ్ శ్నాక్స్, రాత్రి డిన్నర్.ఈ పనులన్నీ ముగించుకునే సరికి రాత్రి పదకొండు. మళ్లీ ఉదయం ఆరింటికి కిచెన్లో లైటు వెలుగుతుంది. ఇది ప్రతి హౌస్ వైఫ్ కథే. ఇక వర్కింగ్ విమెన్ చేసే మల్టీ టాస్కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా ఇంటి, వంట పనులతో తన తల్లి పడుతున్న ఇబ్బందుల్ని చూడలేకపోయింది పద్నాలుగేళ్ల నవశ్రీ ఠాకూర్. ఆ బాధే ఒక డివైజ్ తయారీకి కారణమయింది. అంతేనా అవార్డు కూడా తెచ్చిపెట్టింది.
మన దేశంలో ప్రతి హౌస్ వైఫ్ రోజులో 356 నిమిషాలు అంటే దాదాపుగా ఆరు గంటలు ఇంటి, వంట పనులకే కేటాయిస్తోంది. క్లీనింగ్, కుకింగ్ పూర్తిచేసుకుని ఆఫీసులకెళ్లే ఆడవాళ్లు కూడా లక్షల్లో ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకరు మధ్య ప్రదేశ్కి చెందిన రజినీ బాయ్. ఆమె రోజూ ఉదయం ఐదింటికే నిద్రలేస్తుంది. టీ, టిఫిన్లతో పాటు మధ్యాహ్నానికి అన్నం, కూరలు వండి ఆఫీసుకి వెళ్తుంది. మళ్లీ తిరిగొచ్చి నేరుగా వంటింట్లోకి వెళ్లి డిన్నర్ ఏర్పాట్లు. ఆదివారం కిచెన్లో ఎక్స్ట్రా డ్యూటీ తప్పదు. తల్లి నిమిషం రెస్ట్ లేకుండా రేయింబవళ్లు పనిచేయడం తట్టుకోలేక పోయింది నవశ్రీ.
అమ్మ కోసం..
అమ్మకి సాయం చేయాలని బలంగా ఉంది నవశ్రీకి. కానీ, ఉదయం స్కూల్కి వెళ్తే తిరిగొచ్చే సరికి సాయంత్రం అవుతుంది. ఇంటికొచ్చాక హోం వర్క్. అయినా సరే తనకున్న కొద్ది టైంలోనే తల్లికి వంట పనుల్లో సాయం చేసేది. కూరగాయలు తరుగుతూ..అమ్మకి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చేది. కానీ, తృప్తి లేదు. తల్లి కష్టం ముందు తన సాయం చాలా చిన్నదనిపించింది. ఇదే విషయం టెన్త్ క్లాస్ చదువుతున్న అక్క పిపారియాకి చెప్పింది. తను కూడా చెల్లి ఆలోచనకి సాయం చేయడానికి ముందుకొచ్చింది. అక్క సపోర్ట్తో తల్లి కోసం ఒక డివైజ్ తయారు చేయాలనుకుంది నవశ్రీ.
కార్పెంటర్లను కలిసింది
ఆలోచన మంచిదే.. కానీ, ఎక్కడ్నించి మొదలుపెట్టాలో అర్థం కాలేదు నవశ్రీకి. చాలా రీసెర్చ్ చేసింది. ఆ ప్రయత్నాల్లోనే తల్లి ఇంటి, వంట పనులని సులభతరం చేయడానికి ఎనిమిది రకాలుగా ఉపయోగపడే డివైజ్ ఐడియా తట్టింది. ఆ వెంటనే గ్రౌండ్వర్క్ మొదలుపెట్టింది. పేపర్పై రఫ్ డిజైన్ గీసింది. చిన్నచిన్న సైన్స్ ప్రిన్సిపల్స్ అప్లయ్ చేసి డివైజ్ తయారు చేసింది. కానీ, మొదటి ప్రయత్నం ఫెయిల్ అయింది. అయినా వెనుకడుగేయలేదు. తన సైన్స్ టీచర్ని కలిసింది. చుట్టు పక్కల ఊళ్లలోని కార్పెంటర్లతో మాట్లాడింది. వాళ్లందరి సపోర్ట్, సజెషన్స్తో దాదాపు రెండేళ్లు కష్టపడి ఒక డివైజ్ని తయారుచేసింది. రిజల్ట్ బాగుండటంతో తన తల్లిలా ఇంటి, ఆఫీసు పనులతో సతమతమవుతున్న వాళ్లకోసం ‘మల్టీ యూజ్ కిచెన్ మెషిన్’ పేరుతో ఆ డివైజ్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఎలా పనిచేస్తుంది?
చెక్క, స్టీల్ ప్లేట్స్, కప్పులతో తయారుచేసిన ఈ మెషిన్ చూడ్డానికి అచ్చం బిల్డింగ్ బ్లాక్స్లా ఉంటుంది. పని అయిపోయాక చక్కగా మడిచి పక్కన పెట్టొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మల్టీ యూజ్ కిచెన్ మెషిన్ సాయంతో ఒకేసారి ఎనిమిది పనులు చేయొచ్చు. కూరగాయలు తరగొచ్చు. నిమిషాల్లో ఫ్రూట్, వెజిటబుల్ జ్యూస్లు తీయొచ్చు. మసాలాలు కూడా తయారు చేయొచ్చు. వేడి వేడి రొట్టెలతో పాటు మరెన్నో పనులు చేయొచ్చు. ఈ డివైజ్ తయారుచేసినందుకు నవశ్రీకి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇన్స్పైర్ అవార్డు వచ్చింది. ఈ డివైజ్ మార్కెట్లో
3,000 రూపాయలకి అందుబాటులో ఉంది.