న్యూఢిల్లీ, వెలుగు: సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం వర్సిటీకి చెందిన స్టూడెంట్ రేణుశ్రీ సూసైడ్ పై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్చార్సీ) స్పందించింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించిన కమిషన్.. ఈ ఘటనపై సోమవారం తెలంగాణ సీఎస్, డీజీపీలకు నోటీసు జారీ చేసింది.
విద్యార్థిని ఆత్మహత్యపై 4 వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పోలీసుల విచారణ, సంఘటనకు బాధ్యులైనవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని పేర్కొంది. కాగా, తోటి విద్యార్థులు చూస్తుండగానే ఈ నెల 5 న రేణుశ్రీ.. తాను చదువుతున్న గీతం వర్సిటీ బిల్డింగ్ మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.