- కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు ఇబ్బంది పడుతున్న బారోవర్లు
- సొంతంగా వ్యాపారం చేసుకునే కస్టమర్లపైనే ఎక్కువ ప్రభావం
- బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వద్ద మొండిబాకీలుగా మారుతున్న లోన్లు
- తాత్కాలికమే అంటున్న ఎనలిస్టులు..
బిజినెస్డెస్క్, వెలుగు: హోమ్, గోల్డ్ లోన్లు తీసుకున్న కస్టమర్లు తిరిగి చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సొంతంగా వ్యాపారం చేసుకునే కస్టమర్లు అప్పులు కట్టడంలో డీఫాల్ట్(తిరిగి చెల్లించలేకపోవడం) అవుతున్నారు. కరోనా సెకెండ్ వేవ్ దెబ్బతో వీరి బిజినెస్లు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో అప్పులు తిరిగి కట్టడంలో ఫెయిలవుతున్నారు. రిటెయిల్ లోన్లు డీఫాల్ట్ అవుతుండడం ఇప్పుడిప్పుడే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) పై ప్రభావం చూపుతోంది. సెక్యూర్డ్ లోన్లుగా భావించే హోమ్ లోన్లు, గోల్డ్ లోన్లలో డీఫాల్ట్స్ పెరుగుతుండడం ఆర్థిక వ్యవస్థను కలవర పెట్టేదే. గోల్డ్ లోన్ల విషయానికొస్తే, బారోవర్లు తనఖా పెట్టిన గోల్డ్ను కంపెనీలు వేలం వేస్తున్నాయి. లోన్లను రికవరీ చేయడంలో ఉన్న మార్గాలన్నీ ఫెయిలైతే గాని తనఖా గోల్డ్ను కంపెనీలు వేలం వేయవు. ఫైనాన్షియల్ సిస్టమ్ ఒత్తిడిలో ఉందనే విషయాన్ని ఇది తెలుపుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. కరోనా మొదటి వేవ్ ప్రభావం గ్రామాలు, సెమిసిటీలలో కంటే సిటీలపై ఎక్కువగా పడింది. కానీ, ఈ ఏడాది వచ్చిన కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం గ్రామాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అగ్రికల్చర్, రిలేటెడ్ సెక్టార్లలో గోల్డ్ అసెట్స్ను తనఖా పెట్టి తీసుకున్న అప్పులు ఎక్కువగా డీఫాల్ట్ అవుతున్నాయి.
హోమ్ లోన్లు డీఫాల్ట్..
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రిటెయిల్ కస్టమర్లకు ఇచ్చిన లోన్లు డీఫాల్ట్ అవుతున్నాయి. మైక్రో క్రెడిట్ నుంచి వెహికల్ లోన్స్, గోల్డ్ లోన్స్, హోమ్ లోన్స్ వరకు అన్ని లోన్ల పోర్టుఫోలియోలు ఒత్తిడిలో ఉన్నాయి. బారోవర్లు అప్పులను తిరిగి చెల్లించలేకపోవడం పెరిగింది. హౌసింగ్ లోన్ కంపెనీలు హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వంటి కంపెనీల మొండిబాకీలు ఈ ఏడాది జూన్ క్వార్టర్లో పెరిగాయి. ముఖ్యంగా ఎల్ఐసీ హౌసింగ్, పీఎన్బీ హౌసింగ్ కంపెనీలు కరోనా సెకెండ్ వేవ్ వలన ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి. సొంతంగా వ్యాపారం చేసుకునే కస్టమర్లు (సెల్ఫ్ ఎంప్లాయిడ్) , లీజ్ రెంటల్ సెగ్మెంట్కు ఇచ్చిన లోన్ల వలన హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్లో మొండిబాకీల ఒత్తిడి పెరుగుతోందని ప్రభుదాస్ లీలాధర్ఎనలిస్ట్ శ్వేత దప్తర్దార్ అన్నారు. ప్రాపర్టీ లోన్లు, కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీలపై ఇచ్చే లోన్ల వలనే డీఫాల్ట్స్ పెరుగుతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది.
గోల్డ్ లోన్లు సైతం..
కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం గోల్డ్ లోన్ బారోవర్లపై ఎక్కువగా పడుతోంది. గోల్డ్ను తనఖా పెట్టి తీసుకున్న లోన్లను తీర్చడంలో బారోవర్లు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఫైనాన్షియల్ కంపెనీలు కూడా తమ దగ్గర ఉన్న గోల్డ్ను వేలం వేస్తున్నాయి. లోన్లను రికవరీ చేయడంలో చివరి ఆప్షన్గా కంపెనీలు వేలానికి వెళతాయి. ఒక కంపెనీ తన దగ్గర తనఖాగా ఉన్న గోల్డ్ను వేలం వేస్తుందంటే, గోల్డ్ లోన్ బారోవర్లు తమ అప్పులను తీర్చలేకపోయారని అర్థం. గోల్డ్ లోన్లను ఎక్కువగా ఇచ్చే మణప్పురం ఫైనాన్స్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే, కరోనా ప్రభావం గోల్డ్ లోన్లపై ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. మణప్పురం మార్చి క్వార్టర్లో రూ. 410 కోట్ల విలువైన గోల్డ్ను వేలం వేసింది. జూన్ క్వార్టర్లో మరో రూ. 1,500 కోట్ల విలువైన గోల్డ్ను వేలం వేసింది. కంపెనీ మేనేజ్ చేస్తున్న గోల్డ్ జూన్ క్వార్టర్ నాటికి ఏడాదికి 6.8 శాతం పడింది. కంపెనీ మేనేజ్ చేస్తున్న గోల్డ్ అసెట్స్ 69 టన్నుల నుంచి 58.1 టన్నుకు పడిపోయింది.