
- హైదరాబాద్లో 22 క్యారెట్ల రేటు 10 గ్రా: రూ.39,810
- కొవిడ్ఎఫెక్ట్తో గ్లోబల్గా ఇన్వెస్టర్ల గోల్డ్రష్
- పెండ్లిండ్ల సీజన్కావడంతోనూ పెరిగిన డిమాండ్
- రూ. 50 వేలు కూడా దాటొచ్చంటున్న ఎక్స్పర్ట్స్
- గ్లోబల్గా ఏడేండ్ల రికార్డు బ్రేక్
హైదరాబాద్, వెలుగు:చైనాలో కొవిడ్ఎఫెక్ట్తో ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ ప్రతికూల ప్రభావం చూపుతుందనే అంచనాలుండటంతో ఇన్వెస్టర్లు గోల్డ్కోసం ఎగబడుతున్నారు. ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ప్రతికూల పరిణామాలు ఎదురైతే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్కు సేఫ్గా ఉంటుందని గోల్డ్ను ఎంచుకుంటారు. ఇప్పుడూ ఇదే దారి ఎంచుకున్నారు. గోల్డ్వైపే చూస్తున్నారు.
దీంతో గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ఏడేండ్లలో ఎన్నడూ లేనంత పెరిగింది. ఔన్సు బంగారం ధర 1,650 డాలర్లకు చేరింది. శనివారం ఔన్స్ (28.3 గ్రాములు) గోల్డ్ ధర గ్లోబల్ మార్కెట్లలో 1,643.89 డాలర్లకు (రూ. లక్షా 18 వేల రూపాయలు) పైన పలికింది. మన మార్కెట్ పరిస్థితీ ఇంతే. గోల్డ్ రేటు దేశంలో 5 రోజుల్లోనే రూ.1,800 పెరిగింది. మాఘ మాసం కావడంతో సౌతిండియాలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పెండ్లి ముహుర్తాలు పెట్టుకున్నారు. వీళ్లకూ బంగారం తప్పనిసరి అవసరం. దీంతో డిమాండు బాగా
పెరిగింది.
రూపాయి విలువ పడిపోయి..
బంగారం రేటు మున్ముందు మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలంటున్నాయి. రూ. 50 వేలు కూడా దాటే అవకాశం ఉందని చెబుతున్నాయి. అమెరికా డాలర్తో పోలిస్తే మన రూపాయి బలహీనపడుతోందని, దీని వల్ల కూడా గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. చైనాలో కొవిడ్ ఎఫెక్ట్ తగ్గి గ్లోబల్ స్టాక్ మార్కెట్లు రికవర్ అయితే గానీ ధరలు దిగి రావని చెబుతున్నారు. రేట్లు పెరగడంతో రిటైల్ కొనుగోలుదారులు, జువెల్లర్స్ కొనడానికి ముందుకొస్తలేరని కోల్కతాలోని ఓ హోల్సేలర్ చెప్పారు. పెళ్లిళ్ల సీజనైనా ధర ఎక్కువుండటంతో అమ్మకాలు బాగా తగ్గాయని మరో దుకాణదారుడు అన్నారు. కొందరు పాత బంగారం మార్చుకుని కొత్తది కొంటున్నారని చెప్పారు.
గ్లోబల్, లోకల్ కారణాలతో..
బంగారం ధర అంతర్జాతీయ, లోకల్ పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ద్రవ్యోల్బణం, గ్లోబల్గా బంగారం ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, రాజకీయ పరిస్థితులు, ట్రేడ్ వార్స్ గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తాయని చెబుతుంటారు.