- గోల్డ్కు గిరాకీ పెరుగుతది
- 2021లో అమ్మకాలు బాగుంటాయ్
- సమీప భవిష్యత్లో మాత్రం రేట్లు తగ్గొచ్చు
- ఎనలిస్టుల అంచనాలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల బంగారం ధరలు విపరీతంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం తులం ధర రూ.46 వేలకు పడిపోయింది. అయితే ఈ పరిస్థితి మరీ ఎక్కువ కాలం ఉండబోదని, రేట్లు తప్పక పెరుగుతాయని ఎనలిస్టులు అంటున్నారు. కొన్ని నెలల క్రితం లాక్డౌన్ రిస్ట్రిక్షన్లు ఎత్తివేసినప్పటి నుంచి పరిస్థితి ఆశావహంగా మారిందని, కొనుగోళ్లు మెల్లమెల్లగా పెరుగుతున్నాయని అన్మోల్ జ్యూయలర్స్ ఫౌండర్ ఇషా దత్వానీ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో షాపులు రద్దీగా కనిపిస్తున్నాయని అన్నారు. 2021లో బంగారానికి డిమాండ్ కరోనాకు ముందున్న నాటి స్థితికి తప్పక వస్తుందని అమ్రపాలి జ్యూయలర్స్ క్రియేటర్ డైరెక్టర్ తరంగ్ అరోరా నమ్మకంగా చెప్పారు. ‘‘కానుకలు ఇవ్వడానికి ఇక నుంచి చాలా మంది బంగారం కొంటారు. మార్కెట్లోకి అద్భుతమైన డిజైన్లు వచ్చాయి. జ్యూయలర్లంతా డిజైన్లపై ఎక్కువ ఫోకస్ చేయాలి. నగలు ఆకర్షణీయంగా ఉంటే అమ్మకాలు కచ్చితంగా పెరుగుతాయి. బంగారం చాలా విలువైనదని, ఎంత ఎక్కువ కొంటే అంత మంచిదని జనానికి కరోనా వల్ల అర్థమైంది. ఇన్వెస్ట్మెంట్గానూ ఉపయోగించుకోవచ్చని తెలుసుకున్నారు. ధరలు కూడా ఇప్పుడు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొనడానికి ఇదే మంచి సమయం’’ అని అరోరా వివరించారు. వజ్రాలకు కూడా డిమాండ్ పెరుగుతున్నదని ఇండియా నేచురల్ డైమండ్ కౌన్సిల్ ఎండీ రిచాసింగ్ చెప్పారు. ‘‘మేం కొన్ని రోజుల క్రితం అమెరికాలో సర్వే చేశాం. గిఫ్ట్ ఇవ్వడానికి వజ్రాల నగలు కొన్నామని 80 శాతం రెస్పాండెంట్లు వెల్లడించారు. ముఖ్యమైన సందర్భాల్లో కానుకగా ఇవ్వడానికి ఎక్కువ మంది వజ్రాల నగలను కొంటున్నారు. ఇండియాలోనూ యూత్కు లగ్జరీ జ్యూయలరీపై ఎంతో మోజు ఉంది. గిఫ్ట్ ఇవ్వడానికి డైమండ్ జ్యూయలరీనే కొంటున్నారు’’ అని ఆమె వివరించారు.
రేటు రూ.42 వేలకు పడిపోవచ్చు
త్వరలో బంగారం ధరలు రూ.41,500–రూ.42 వేల స్థాయికి పడిపోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బులియన్ మార్కెట్కు ఎన్నో సవాళ్లు ఉన్నాయని అంటున్నారు. అమెరికా ట్రెజరీ బాండ్ల ఈల్డింగ్ పెరగడంతో కొన్ని రోజులుగా బంగారం రేట్లు తగ్గుతున్నాయి. డాలర్ మారక విలువ బలపడటం కూడా మరో కారణం. దీంతో ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి ఉంటోంది. గ్లోబల్ ఎకానమీ పుంజుకుంటుండటం, వడ్డీరేట్లు నిలకడగా ఉండటంతో ఇన్వెస్టర్లు బంగారానికి బదులు ఇతర ఈక్విటీ, డెట్ అసెట్స్ వైపు చూస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో మనదేశంలో తులం బంగారం రికార్డుస్థాయిలో రూ.58,000 పలికింది. అప్పటి నుంచి రేట్లు పడుతూనే ఉన్నాయి. ధరలు పెరిగిన సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. అక్టోబరు, డిసెంబరు నెలల్లో మాత్రం పాజిటివ్ రిటర్నులు ఇచ్చాయి. వరల్డ్ గోల్డ్స్ కౌన్సిల్ ఇండియా ఎండీ సోమసుందరం మాట్లాడుతూ ‘‘గోల్డ్ ఈటీఎఫ్లు ఫిబ్రవరిలో రెండు శాతం నష్టపోయాయి. బంగారం ధరలు బాగా తగ్గాయి. గ్లోబల్ ఈటీఎఫ్లలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. గత నాలుగు నెలల్లో మూడుసార్లు ధరలు తగ్గాయి. కమోడిటీ ఎక్సేంజీ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి ఉంది’’ అని ఆయన వివరించారు. ఇప్పుడున్న ధరలతో పోలిస్తే బంగారం ధరలు త్వరలో 20 శాతం వరకు తగ్గి రూ.42 వేలకుపడిపోవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ చెప్పారు. చాయిస్ బ్రోకింగ్ రీసెర్చ్ అసోసియేట్ సునంద్ సుబ్రమణియమ్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ గోల్డ్ ఫ్యూచర్లు ఇక నుంచి బేరిష్గానే ఉండొచ్చని అన్నారు. యూఎస్ బాండ్ ఈల్డ్, కరోనా ప్యాకేజీ, అమెరికాలో జీతాలు పెరగడం వంటివన్నీ బంగారం ధరలు తగ్గడానికి కారణాలని వివరించారు.