
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై.. టాలీవుడ్తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కంగ్రాట్యూలేషన్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ విజయానికి అభినందనలు.. మీరు భారతదేశం గర్వపడేలా చేశారు అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.
పఠాన్ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న షారుఖ్ ఖాన్.. ఆర్ఆర్ఆర్ టీమ్కు ప్రత్యకంగా అభినందనలు తెలిపారు. సార్ ఇప్పుడే మేల్కొన్నాను.. గోల్డెన్ గ్లోబ్స్లో మీ విజయాన్ని పురస్కరించుకుని నాటు నాటుకు డ్యాన్స్ చేయడం ప్రారంభించాను అంటూ షారుఖ్ ట్వీట్ చేశారు. మీరు మరెన్నో అవార్డులు అందుకోవాలి. ఇది చూసి భారతదేశం గర్విచేలా ఉందని చెప్పారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఆర్ఆర్ఆర్ టీమ్కు అభినందనలు తెలిపారు.
ప్రెజెంటర్గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కు చాలా సార్లు హాజరైన ప్రియాంక చోప్రా, RRR టీమ్ను అభినందించింది. ఒక్క పాటతో గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న మొట్టమొదటి ఆసియా చిత్రమని ఆమె అన్నారు. ఇది భారతీయ సినిమాకు అద్భుతమైన విజయమని ప్రియాంక చోప్రా ట్వీట్ చేశారు.
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్తో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపించాడు. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత ఈసినిమా గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయిన అన్ని భాషల్లో ఈ సినిమా కోట్లు రాబట్టుకుంది. ఇక్కడ మాత్రమే కాదు రీసెంట్గా జపాన్లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ను సొంతం చేసుకుంటుంది. ఇక ఈసినిమా ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టుకున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును సొంతం చేసుకుంది. ఆ తరువాత సన్సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా నిలిచింది. రీసెంట్గా రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వరించింది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.