- ఇప్పటికే 700 ఫేక్ లెండింగ్ యాప్లపై చర్యలు
- ప్లేస్టోర్ పాలసీలను అప్డేట్ చేస్తున్న గూగుల్
- ఆన్లైన్ లెండింగ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ లోన్ యాప్లతో సైబర్ మోసాలు బాగా పెరిగాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లెండింగ్ యాప్లపై ఫిర్యాదులు రెండింతలు పెరిగి 1,062 కి చేరుకున్నాయని ఫైనాన్స్ మినిస్ట్రీ ఇప్పటికే ప్రకటించింది. ఇంటర్నెట్ను సేఫ్గా వాడుకునేందుకు , ఆన్లైన్ ఫ్రాడ్స్ అరికట్టేందుకు గూగుల్, ఫిన్టెక్ అసోసియేషన్ ఫర్ కన్జూమర్ ఎంపవర్మెంట్ (ఫేస్) చేతులు కలిపాయి. కన్జూమర్లను వేధిస్తున్న డిజిటల్ లెండింగ్ యాప్ల వివరాలను గూగుల్కు ఫేస్ అందిస్తోంది. పాలసీలను ఫాలో కాని ఇటువంటి యాప్లపై వేగంగా చర్యలు తీసుకోవడానికి వీలుంటోంది. ‘యూజర్లను రక్షించడమే ఈ పార్టనర్షిప్ లక్ష్యం. ఫిన్టెక్ కంపెనీల ఎథిక్స్, రెస్పాన్సిబిలిటీలను మెరుగుపరిచేందుకు, పాజిటివ్ చేంజ్ తీసుకొచ్చేందుకు పనిచేస్తోంది’ అని బ్యాలెన్స్హీరో ఇండియా సీఓఓ సౌపర్నో బగ్చి పేర్కొన్నారు. గూగుల్–ఫేస్ భాగస్వామ్యంతో సురక్షితమైన లెండింగ్ యాప్లను కన్జూమర్లు వాడుకోవడానికి వీలుంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. కన్జూమర్లు ధైర్యంగా లోన్లు తీసుకోవచ్చని, ఎటువంటి మోసాలకు గురికారని అంటున్నారు. సైబర్ మోసగాళ్లు ఒరిజినల్ యాప్లకు పోలి ఉండే యాప్లను తీసుకొస్తున్నారు. వీటిని ప్లేస్టోర్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇటువంటి ఇల్లీగల్ యాప్లను ఫేస్ కనిపెడుతోంది. గూగుల్ ప్లేస్టోర్ను నిరంతరం మానిటర్ చేస్తోంది. ఇల్లీగల్ లెండింగ్ యాప్లను గుర్తించేందుకు ముఖ్యంగా రెండు అంశాలను పరిశీలిస్తోంది. కొత్తగా ప్లేస్టోర్లోకి ఎంట్రీ ఇచ్చిన లెండింగ్ యాప్లను చెక్ చేస్తోంది. స్టాండర్డ్స్కు తగ్గట్టు ఉన్నాయో లేదో చూస్తోంది. దీంతో పాటు ఏదైనా లెండింగ్ యాప్ రేటింగ్ సడెన్గా పెరిగినా లేదా తగ్గినా వాటిపై ఫోకస్ పెడుతోంది. పైన పేర్కొన్నట్టు సంకేతాలు కనిపిస్తే వెంటనే దర్యాప్తు చేస్తున్నామని, రివ్యూ కూడా చేపడుతున్నామని ఫేస్ పేర్కొంది. ఈ దర్యాప్తు వివరాలను గూగుల్కు అందిస్తున్నామని, ఆ తర్వాత ఈ టెక్ కంపెనీ తదుపరి చర్యలు తీసుకుంటోందని వివరించింది. ఇలా లెండింగ్ యాప్లను రివ్యూ చేయడం ద్వారా మోసగాళ్లు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతోందని ఫేస్కు చెందిన సక్సేనా వెల్లడించారు. తమ మానిటరింగ్ విధానాలను మెరుగుపరుచుకుంటున్నామని చెప్పారు.
కంట్రోల్ అవసరం
డిజిటల్ లెండింగ్ ఇండస్ట్రీని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇండస్ట్రీలో ఇల్లీగల్ యాప్స్ కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, వీటిని ఏరిపారేయాలని అన్నారు. ఇల్లీగల్ యాప్స్ వలన డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్లపై బారోవర్లకు చెడు అభిప్రాయం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. ‘డిజిటల్ లెండింగ్ యాప్లు ముఖ్యంగా విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న కంపెనీలు తప్పుడు విధానాలను ఫాలో అవుతున్నాయి’ అని ఫ్లెక్స్పే బై వివిఫై సీఈఓ అనిల్ పినపాల వెల్లడించారు. అప్పులు తీసుకునేటప్పుడు చెల్లించాల్సిన ఛార్జీలు, లోన్ అగ్రిమెంట్ గురించి ఇవి బయట పెట్టడం లేదని చెప్పారు. తాజాగా గైడ్లైన్స్ తీసుకురావడంతో డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్లు పూర్తి వివరాలను బయటపెడుతున్నాయని అన్నారు. డిజిటల్ లెండింగ్ ఇండస్ట్రీ కోసం ఫ్రేమ్వర్క్ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
ఫేక్ యాప్లపై ప్రభుత్వానికి రిపోర్ట్..
ఫేస్ గత కొంత కాలంగా దేశంలోని డిజిటల్ లెండింగ్ యాప్లను గమనిస్తోంది. గత 15 నెలల్లో 700 ఇల్లీగల్ యాప్లపై యాప్ స్టోర్లకు, రెగ్యులేటర్స్కు, ప్రభుత్వానికి రిపోర్ట్ చేశామని ఈ సంస్థ చెబుతోంది. ఫేక్ యాప్లను అరికట్టేందుకు ప్లేస్టోర్ పాలసీలను రివ్యూ చేస్తున్నామని, అప్డేట్ చేస్తున్నామని గూగుల్ వెల్లడించింది. పాలసీ రూల్స్ను ఉల్లంఘించినందుకు కిందటేడాది సూమారు 3,500 పర్సనల్ యాప్లపై చర్యలు తీసుకున్నామని ఈ టెక్ కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా గూగుల్ – ఫేస్ కలిసి ఆన్లైన్ ఫ్రాడ్స్ను అరికట్టేందుకు డిజి కవచ్ ఇనీషియేటివ్ను తీసుకొచ్చాయి.