
‘స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాళ్ల డేటాకు సెక్యూరిటీ అందించడంలో గూగుల్ తరువాతే ఏదైనా’ అంటుంటారు చాలా మంది. ఎందుకంటే ఒక వ్యక్తి బయోడేటా మొత్తం గూగుల్ దగ్గర ఉంటుంది. అయినా యూజర్ ప్రమేయం లేకుండా గూగుల్ దగ్గర నుంచి ఆ డేటా కొట్టేయడం కష్టమైన పని. సెక్యూరిటీ అనే కాదు యూజర్స్కు ఉపయోగపడే యాప్స్తో పాటు, వాళ్లకు సులువయ్యే ఫీచర్లనీ తీసుకొస్తుంటుంది గూగుల్.
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా, ఎలా వెళ్లాలన్నా అందరికీ ఉపయోగపడుతుంది గూగుల్ మ్యాప్స్ యాప్. ఇందులో ఏ మూల, ఏ ఊరుందో కూడా తెలుసుకోవచ్చు. రెస్టారెంట్స్, హోటల్స్, పెట్రోల్ బంక్స్, హాస్పిటల్స్, షాప్స్ ఎక్కడున్నాయని ఇందులో ఒక్క క్లిక్తో తెలుసుకోవచ్చు. వాటితోపాటే ఇప్పటినుంచి ఎయిర్ పొల్యూషన్ కూడా తెలుసుకోవచ్చు. ఏ ఏరియాలో ఎంత పొల్యూషన్ ఉంది, గ్రీన్ జోన్, రెడ్ జోన్, ఎల్లో జోన్లు ఎక్కడున్నాయో చూపెడుతుంది. దీనికోసం సిపిసిబి (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా)తో కలిసి పని చేస్తుంది గూగుల్. దీనివల్ల ఏ ఏరియా సేఫ్గా ఉంది, పొల్యూషన్ ఎక్కడ ఎక్కువగా ఉందో తెలుసుకోవచ్చు. ఆ ఏరియాకు వెళ్లినప్పుడు దానికి తగ్గజాగ్రత్తలు తీసుకోవచ్చు అంటోంది గూగుల్.
నో కమర్షియల్ యాడ్స్
ఫోన్ వాడుతున్నప్పుడు రకరకాల కమర్షియల్ యాడ్స్ కనిపిస్తుంటాయి. వీటిని ఆర్సిఎస్ (రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్) అంటారు. గూగుల్లో ఏదన్నా సెర్చ్ చేస్తే చాలు, సెర్చ్ చేసింది కాకుండా దానికి సంబంధించిన యాడ్స్ కనిపిస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా ‘మా యాప్లో షాపింగ్ చేయండి. డిస్కౌంట్ ఉంటుంది. దీనికి ముందు కొంత డబ్బు కట్టాల్సి ఉంటుంది’ అని, ‘బయట ఉన్నదానికన్నా తక్కువ ధరకే ప్రొడక్ట్ అమ్ముతున్నాం. కొనుక్కోండి’ అని ఫేమస్ కంపెనీల పేర్లతో యాడ్స్ కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఫోన్కు కూడా యాడ్ లింక్స్ రూపంలో రకరకాల మెసేజ్లు వస్తుంటాయి. వీటి మాయలో పడి లింక్ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. ఇలాంటి స్పామ్, ఫ్రాడ్ యాడ్స్కు చెక్ పెట్టడానికి, కస్టమర్ల సేఫ్టీ కోసం ఇకనుంచి ఆర్సిఎస్ యాడ్స్ ఆపేస్తుంది గూగుల్ కంపెనీ. దీనివల్ల యూజర్లు మోసపోయే అవకాశం తగ్గుతుందని చెప్తోంది గూగుల్.