
1998 నుంచి 2017 వరకు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ బీజేపీకి కంచుకోట. 2017 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అక్కడ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ యూపీకి సీఎం అయ్యారు. 2018లో జరిగిన ఉప ఎన్నికలో ఆ సీటు అనూహ్యంగా ఎస్పీ గెలుచుకుంది. గోరఖ్పూర్ను ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. దీంట్లో భాగంగా అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో హీరో రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ఆయన దాదాపు 12 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. గోరఖ్పూర్ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన భోజ్పురి నటుడు రవికిషన్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో ఆదిత్యనాథ్ కీ రోల్ ప్లే చేస్తుండగా.. రవికిషన్ ఆయన పక్కనే ఉంటున్నారు.
పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి
గోరఖ్పూర్లో బీజేపీకి పూర్వవైభవం తీసుకురావాలని పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహిని కార్యకర్తలతో కలిసి బీజేపీ ప్రచారంలో స్పీడు పెంచింది. 2018 బై ఎలక్షన్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని, ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచి కచ్చితంగా బీజేపీని గెలిపించాలనే పట్టుదలతో ఉన్నామని కార్యకర్తలు చెప్పారు. ఈ ఎన్నికల్లో రవికిషన్ ఫైట్ చేయడం లేదని, యోగినే బరిలో ఉన్నట్లు అనిపిస్తోందని స్థానికులు చెప్తున్నారు.
రవికిషన్పై ఔట్సైడర్ అనే ముద్ర
రవికిషన్పై నాన్లోకల్ అనే ముద్ర ఉంది. దాన్ని తుడిచేసుకునేందుకు కిషన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే వాళ్ల పూర్వీకులు ఉన్న మామ్కోర్ గ్రామానికి వెళ్లి తాను యూపీకి చెందిన వాడినే అనే విషయాన్ని ప్రచారం చేసుకున్నారు. ప్రచారంలో ప్రజలతో కలిసిపోయి.. వారితో సెల్ఫీలు తీసుకుంటున్నారు. యోగిఆదిత్యనాథ్ తనను బరిలోకి దింపారని, రికార్డు స్థాయిలో ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు.
బీజేపీ, కూటమి మధ్య ప్రధాన పోటీ
గోరఖ్పూర్లో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీ – బీఎస్పీ కూటమికి మధ్యే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బై ఎలక్షన్స్లో ఎస్పీ తరఫున నిలబడి బీజేపీని ఓడించిన ప్రవీణ్ కుమార్ నిషాద్ బీజేపీలోకి జంపయ్యారు. బీజేపీ ఆయనకు సంత్ కబీర్ స్థానాన్ని కేటాయించింది. గోరఖ్పూర్ను రవికిషన్కు ఇచ్చింది. ఎస్పీ – బీఎస్పీ కూటమి తరఫున సీనియర్ లీడర్ రామ్ భువాల్నిషాద్ బరిలోఉన్నారు. నిషాద్ కమ్యూనిటీకి చెందిన 3.5 లక్షల ఓట్లు కూటమికి వస్తాయని ధీమాతో ఉన్నారు. రామ్ భువాల్కు ఉన్న అనుభవం, మంచి పేరు కూటమిని గెలిపిస్తుందని ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు చెప్తున్నారు.