- రూ. 500 కోట్ల విలువైన భూములు స్వాహా
- కబ్జా భూములకు పాస్బుక్లు ఇచ్చిన ఆఫీసర్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కోట్లాది రూపాయల విలువైన సర్కారు, అసైన్డ్ భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్స్కు సరైన హద్దులు లేకపోవడం కబ్జాదారులకు కలిసొచ్చింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాగా ఏర్పాటైన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, ఎస్పీ ఆఫీస్పాల్వంచలోనే ఏర్పాటు చేయాలని భావించడంతో ఇక్కడ భూముల రేట్లకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో సర్కారు భూములపై కబ్జాదారుల కన్ను పడింది. బీఆర్ఎస్ప్రజాప్రతినిధులు, లీడర్ల అండతో కొందరు బడాబాబులు, దళారులు ఆఫీసర్లను మచ్చిక చేసుకొని సర్కారు, అసైన్డ్ భూములు కాజేసినట్టు ఇటీవల ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
రూ. వందల కోట్ల గవర్నమెంట్ ల్యాండ్స్ మాయం
పాల్వంచలోని 444, 817, 999 సర్వే నంబర్లలో సుమరు 7 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉన్నాయి. గత పదేళ్లలో.. ముఖ్యంగా కొత్తగూడెం జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇందులో భూములు కబ్జా కావడం మొదలైంది. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతల అండదండలతోనే కబ్జాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బీజేపీ నాయకుడు పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆర్టీఐ ద్వారా ఈ సర్వేనంబర్లలో ఉన్న భూమి ఎంత, ఎంత భూమి కబ్జా అయింది అనే వివరాలను అడిగారు.
ఈ సర్వే నంబర్లలో వివిధ సందర్భాల్లో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ అవసరాల కోసం, పేదలకు పంపిణీ చేసేందుకు కొంత భూమిని కేటాయించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కోసం కాకతీయ యూనివర్సిటీ అనుబంధ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీకి కేటాయించిన దాంట్లో సుమారు 25 ఎకరాల ల్యాండ్ను తీసుకున్నారు. మెడికల్, నర్సింగ్ కాలేజీల కోసం మరికొంత ల్యాండ్ను కేటాయించారు. మిగిలిన దాంట్లో దాదాపు 426 ఎకరాలు ఎన్క్రోచ్మెంట్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కబ్జాలకు గురైన భూమి దాదాపు రూ. 500 కోట్ల విలువ ఉంటుందని అంచనా.
గవర్నమెంట్, అసైన్డ్ ల్యాండ్స్కు సంబంధించి ఖచ్చితమైన హద్దులు లేకపోవడం, ఆఫీసుల్లో రికార్డులు సరిగా లేకపోవడం కబ్జాదారులకు కలిసివచ్చింది. అందినకాడికి భూములు ఆక్రమించుకుని ఫేక్డాక్యుమెంట్లతో పట్టాలు చేసుకుని పాస్బుక్స్ పొందినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులకు బీఆర్ఎస్ లీడర్లు సపోర్ట్ చేశారు. లీడర్ల ఒత్తిడితో అధికారులు బై నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసి పాస్బుక్స్ జారీ చేసినట్టు తెలుస్తోంది. 444, 727, 817, 999 సర్వే నంబర్లలో భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ కలెక్టరేట్ నుంచి ఆదేశాలున్నా రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఇండ్లు కట్టుకున్న వారికి కష్టాలు
రియల్టర్లు కబ్జా చేసిన భూమిలో వెంచర్లు చేసి అమ్మేశారు. కబ్జా ల్యాండ్ అని తెలియక ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న చాలా మంది ఇండ్లు కట్టుకున్నారు. కొంతమంది మాత్రమే లీడర్లను, ఆఫీసర్లను మేనేజ్ చేసి ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇంటి నంబర్లు తీసుకున్నారు. ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్ కాక, బ్యాంక్ నుంచి లోన్లు రాక లబోదిబోమంటున్నారు. బీఆర్ఎస్కు చెందిన ఓ ప్రముఖ నేత అండతో ఆ పార్టీ నేతలు 999 సర్వే నంబర్లో సుమారు 100 ఎకరాలను ఆక్రమించుకున్నట్లు ఆరోపణలున్నాయి.
444, 727, 817, 999 సర్వే నంబర్లలో గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలపై విచారణ జరిపించి భూములను కాపాడాలని పలువురు కలెక్టర్ను కోరుతున్నారు. ఈ భూములను కాపాడాలంటూ కొంతకాలంగా ఆందోళన చేస్తున్న ఆరుద్ర సత్యనారాయణ ఇంకా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. బీజేపీ నాయకులు పొనిశెట్టి వెంకటేశ్వర్లు కూడా కబ్జాల నుంచి సర్కారు భూములను విడిపించాలని కోరుతూ రెండు రోజుల కిందట తహసీల్దార్, కలెక్టర్కు వినతిపత్రాలు ఇచ్చారు.
ప్రత్యేక కమిటీ వేసి సర్వే చేస్తాం
పాల్వంచలోని 444, 817, 999 సర్వే నంబర్లలోని గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమణలపై పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రత్యేక కమిటీ వేసి సమగ్ర సర్వే నిర్వహిస్తాం. సర్వే అనంతరం ఉన్నతాధికారులతో చర్చించి కబ్జాలకు గురైన ల్యాండ్ను స్వాధీనం చేసుకుంటాం.
వివేక్, తహసీల్దార్, పాల్వంచ, భద్రాద్రికొత్తగూడెం జిల్లా