- రూ.3,700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
- వెహికల్ చలాన్ల డ్రైవ్తో రూ.600 కోట్లు
- ఇంకోవైపు భూముల అమ్మకం, అప్పులు
హైదరాబాద్, వెలుగు: డబ్బు సమీకరణపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్(సీఎస్టీ), జీఎస్టీ పాత బకాయిల వసూళ్లకు సిద్ధమైంది. ఇటీవల ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్కు నెలన్నర పాటు ఆఫర్ ఇచ్చి రూ.600 కోట్లు వసూలు చేసినట్టే.. పన్ను బకాయిలున్నోళ్లకు వన్టైం సెటిల్మెంట్ కింద 2 నెలలు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం వచ్చే నెల నుంచి అప్లికేషన్ పెట్టుకునేందుకు అవకాశమివ్వనుంది. అది కూడా అధికారుల తప్పులు, ఏదో ఒక ఇబ్బందితో కట్టకుండా ఉన్న వారికి మాత్రమే ఆఫర్ను వర్తింపజేసేందుకు యోచిస్తోంది. కావాలని పన్ను ఎగ్గొట్టిన వాళ్ల నుంచి మాత్రం వంద శాతం వసూలు చేయాలని భావిస్తోంది. వాస్తవానికి 2017 జులై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అయితే, అంతకుముందు అమల్లోఉన్న వ్యాట్, సీఎస్టీ, ఎంట్రీ ట్యాక్స్ల బకాయిలు రూ.3,700 కోట్ల వరకున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఆఫర్ ఇవ్వడం ద్వారా బకాయిల్లో కనీసం రూ.2 వేల కోట్లైనా రాబట్టేందుకు సర్కారు టార్గెట్ పెట్టుకుంది.
ఎగవేతదారులు 26 వేల మంది
రాష్ట్రంలో 26 వేల మంది పన్ను ఎగవేసినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో సీఎస్టీ ఎగవేతదారులు 12,680 మంది, వ్యాట్ ఎగవేతదారులు 11,450 మంది, ఎంట్రీ ట్యాక్స్ ఎగవేతదారులు 340 మంది, జీఎస్టీ ఎగవేతదారులు 1,538 మంది ఉన్నట్టు ఇటీవల ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల శాఖ రిపోర్టు ఇచ్చింది. ఇండస్ట్రీస్, కమర్షియల్ ఏజెన్సీలు ఎగ్గొట్టిన పన్నుల్లో 50 నుంచి 60 శాతం, వ్యాట్, సీఎస్టీలకు 40 శాతం వరకు చెల్లించేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రూ.25 లక్షల కన్నా ఎక్కువ బకాయిలున్నోళ్లకు.. ఎలాంటి వడ్డీ లేకుండానే 4 వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించాలని యోచిస్తోంది.
వ్యాట్లోనే రూ.2,160 కోట్ల బకాయిలు
మొండి బకాయిల్లో ఎక్కువగా వ్యాట్ నుంచే రావాల్సి ఉంది. దాదాపు రూ.2160 కోట్లు వ్యాట్ బకాయిలున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత సీఎస్టీ నుంచి రూ.671 కోట్లు, ఎంట్రీ ట్యాక్స్ బకాయిలు రూ.583 కోట్లు ఉన్నాయి. జీఎస్టీ నుంచి రూ.286 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.