
- నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రోస్కోపీ యూనిట్ ప్రారంభం
నల్గొండ, వెలుగు: పేదలకు అధునాతన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. సోమవారం నల్గొండలోని జిల్లా ఆసుపత్రిలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ యూనిట్ ను పద్మవిభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నానని, ఏడాదిలోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిర్మించామని తెలిపారు.
రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీ కట్టిస్తున్నామని చెప్పారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి ఏఐజీ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ ట్రైనింగ్ చేసే అవకాశం కల్పించాలని కోరారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక, ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన లాప్రోస్కోపిక్ యూనిట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీంతో వివిధ రకాల ఆపరేషన్లకు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
నల్గొండ మెడికల్ కాలేజీని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. డాక్టర్ జీవీ రావు, చారిటీ నిర్వాహకులు ఎస్పీ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అడిషనల్ కలెక్టర్ జె శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, డీఎంహెచ్ వో పుట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.