- ఈ నెల 15 వరకు అవకాశం.. 28న ఎంట్రెన్స్ టెస్ట్
హైదరాబాద్, వెలుగు: బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచింది. తొలుత ఈ నెల 12 చివరి తేదీగా నిర్ణయించగా.. దానిని మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్లు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ఎడ్యుకేషనల్ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి బి.సైదులు వెల్లడించారు. 2024–-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్, డిగ్రీ ఫస్ట్ఇయర్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రెన్స్టెస్ట్ కోసం ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బుధవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
డిగ్రీ కోర్సులలో అడ్మిషన్ కోసం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఆన్లైన్లో tsrdccet.cgg.gov.in వెబ్సైట్ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇంటర్ కోర్సులలో అడ్మిషన్ కోసం పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు mjpabcwreis.cgg.gov.in వెబ్సైట్ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. డిగ్రీ, జూనియర్ కాలేజీలలో రెగ్యులర్ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఎంట్రెన్స్ టెస్ట్ఈ నెల 28న ఉంటుందని, హాల్ టికెట్లు పరీక్షకు వారం రోజుల ముందు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. గురుకుల కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచితంగా విద్య, భోజన వసతితోపాటు యూనిఫామ్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ మొదలైన సదుపాయాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.