ఫైర్ సేఫ్టీపై ఏం చేద్దాం?..పాతబస్తీ ఘటన నేపథ్యంలో ముఖ్య శాఖలతో  త్వరలో సర్కారు మీటింగ్​

ఫైర్ సేఫ్టీపై ఏం చేద్దాం?..పాతబస్తీ ఘటన నేపథ్యంలో ముఖ్య శాఖలతో  త్వరలో సర్కారు మీటింగ్​
  • పాల్గొన్నున్న బల్దియా, హైడ్రా, ఎలక్ట్రిసిటీ, హైడ్రా అధికారులు  
  • అగ్ని ప్రమాదాలు రిపీట్​కాకుండా తీసుకోవాల్సిన యాక్షన్​ప్లాన్​పై చర్చ 
  • ఫైర్​సేఫ్టీ చట్టంలో మార్పులు అవసరం అంటున్న ఆఫీసర్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: చార్మినార్​గుల్జార్ హౌస్ వద్ద ఆదివారం జరిగినటువంటి ఘటన మళ్లీ రిపీట్​కాకుండా ఉండేందుకు ఏమి చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది. వారం రోజుల్లో బల్దియా, ఫైర్​డిపార్ట్​మెంట్, ఎలక్ట్రిసిటీ, హైడ్రా అధికారులతో ఓ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఎనిమిది మంది పిల్లలతో సహా మొత్తం 17 మంది చనిపోవడంతో గుల్జార్​హౌస్​ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఫైర్​సేఫ్టీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫైర్​సేఫ్టీ విషయంలో ఏం చేయాలన్న అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో త్వరలోనే చర్చించనున్నారు. ఈ మీటింగ్​లో అవసరమైతే ఓ కమిటీని నియమించి అది ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు చెప్తున్నారు.  

అవసరమైతే చట్టంలో మార్పులు 

సిటీలో ఫైర్ ఎన్ఓసీ లేని హాస్పిటళ్లు,​ స్కూళ్లు, బట్టల దుకాణాలు, గోదాములు, టింబర్ డిపోలు, ఇతర వ్యాపార సముదాయాలు 10 వేలకి పైగానే ఉన్నాయి. ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలు, వాణిజ్య సముదాయాల్లో మాత్రమే ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, పాత భవనాల్లో చాలావరకు ఫైర్ సేఫ్టీ రూల్స్​పాటించడం లేదు. ఇలాంటివి గుర్తించినప్పుడు ఫైర్​సేఫ్టీ యాక్ట్​ప్రకారం కేవలం నోటీసులిచ్చే అధికారం మాత్రమే ఉండడంతో ఆఫీసర్లు ఏమీ చేయలేకపోతున్నారు. ఫైర్ సేఫ్టీ యాక్ట్​లో మార్పులు చేస్తే తప్ప అనుకున్న మార్పు సాధ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. త్వరలో  జరిగే సమావేశంలో అధికారులు దీనిపై చర్చించనున్నట్లు తెలిసింది.  

షార్ట్ సర్క్యూట్ తోనే ఎక్కువ

నగరంలో చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాల్లో దాదాపు అన్నీ  షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరుగుతున్నాయి. గడిచిన మూడేండ్లలో జరిగిన ప్రమాదాల కారణాలు చూస్తే ఇదే స్పష్టమవుతున్నది. 2022 మార్చి23న బోయగూడ  టింబర్ డిపో, 2023 జనవరి 19న డెక్కన్ మాల్, 2023 మార్చి 16న స్వప్న లోక్ కాంప్లెక్స్, 2023 ఏప్రిల్16న కుషాయిగూడ టింబర్ డిపో, 2023 సెప్టెంబర్ 12న రూబీ లాడ్జి,  2023 నవంబర్ 14న నాంపల్లిలోని బజార్ ఘాట్ లో జరిగిన అగ్నిప్రమాదాలు షార్ట్ సర్య్కూట్ వల్లే జరిగాయి. తాజాగా గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాదం కూడా షార్ట్ సర్క్యూట్ తోనే జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. కేవలం మూడేండ్లలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 58 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 

ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్​పై అధిక బాధ్యత

ఎక్కువగా షార్ట్ సర్క్యూట్ కి సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుండడంతో ప్రభుత్వం నిర్వహించనున్న సమావేశానికి విద్యుత్ శాఖాధికారులు ఇచ్చే సమాచారం కీలకం కానున్నది. ఎక్కడెక్కడ విద్యుత్​లోడ్​ఎంత పెరుగుతోంది? కరెంట్ చౌర్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? షార్ట్ సర్య్యూట్​ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన యాక్షన్​ప్లాన్ ఏమిటి? అందరూ ఎలక్ట్రిక్​వెహికల్స్​కు టర్న్​అవుతున్న క్రమంలో వినియోగం పెరిగితే వచ్చే ఇబ్బందులు ఏమిటి? తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ? వంటి అంశాలను సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.