- రానున్న బడ్జెట్లో కేటాయింపులు 50 శాతం పెంచే ఆలోచన
- ట్యాక్స్ రూల్స్ సులభం చేయాలి: ఫైనాన్షియల్ సెక్టార్
బిజినెస్ డెస్క్, వెలుగు: రానున్న బడ్జెట్లో రూరల్ ఎకానమీపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. గ్రామీణ ప్రాంతాల కోసం చేసే కేటాయింపులను 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 50 శాతానికి పైగా కేంద్రం పెంచనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూరల్ ఖర్చుల కోసం రూ.1.36 లక్షల కోట్లను బడ్జెట్లో కేటాయించారు. ఇప్పటికే ఈ ఖర్చులు రూ.1.60 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రభుత్వం చెబుతోంది. రానున్న బడ్జెట్లో ప్రభుత్వ రూరల్ కేటాయింపులు రూ.2 లక్షల కోట్లకు చేరుకుంటాయని సంబంధిత వ్యక్తులు వివరించారు. జాబ్స్ క్రియేట్ చేయడానికి, అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 న తెచ్చే బడ్జెట్ ఫోకస్ చేస్తుందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ కేటాయింపులు ఏప్రిల్, 2023– మార్చి, 2024 ఆర్థిక సంవత్సరానికి వాడతారు. ఎలక్షన్స్కు ముందు కేంద్రం ప్రవేశ పెట్టబోయే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కానుంది.
ఖర్చులు పెరిగాయ్..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూరల్ ఖర్చులు అంచనాల కంటే ఎక్కువగా పెరిగాయి. కరోనా ప్రభావం రూరల్ ఎకానమీపైనా తీవ్రంగా పడింది. ధరలు పెరగడం (ఇన్ఫ్లేషన్), వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలు తక్కువగా ఉండడంతో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ (ఎంఎన్ఆర్ఈజీఏ) కోసం రిజిస్టర్ అయిన వాళ్లు పెరిగారు. ఈ పథకం కింద ప్రభుత్వం రోజుకి కనీసం రూ.150–250 వరకు వేతనాన్ని ఇస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ స్కీమ్ను నడిపేందుకు రూ.73 వేల కోట్లను కేటాయించగా, ఇప్పటికే రూ.63,260 కోట్లు ఖర్చు చేశామని రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పేర్కొంది. అఫోర్డబుల్ హౌసింగ్ కోసం రూ. 20,000 కోట్లను కేటాయించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు అక్టోబర్లో 8.04 శాతంగా నమోదయ్యింది. దీనిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సి ఉంది. వ్యవసాయ రంగాల్లోని వివిధ స్కీమ్లను రివ్యూ చేయాలని, ఎక్స్పర్టుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ స్కీమ్స్ను సవరించాలని ప్రీబడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ రంగ నిపుణులు సీతారామన్ను కోరారు.
మాకూ టీడీఎస్ మినహాయింపులివ్వండి: ఎన్బీఎఫ్సీలు
రానున్న బడ్జెట్లో ట్యాక్స్లు తగ్గించాలని, సెక్టార్ పరంగా సంస్కరణలు తేవాలని ఫైనా న్షియల్, క్యాపిటల్ మార్కెట్ వర్గాలు ప్రీబడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. బ్యాంకులు, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చినట్టే తమకు కూడా కొన్ని ట్రాన్సాక్షన్లపై టీడీఎస్ మినహాయింపు ఇవ్వాలని ఎన్బీఎఫ్సీ సెక్టార్ లీడర్లు అడిగారు. చిన్న కంపెనీలకు ఇచ్చిన లోన్లను మొండిబాకీలుగా గుర్తించడంలో రూల్స్ను సులభతరం చేయాలని, కార్పొరేట్ లోన్స్తో వీటిని పోల్చవద్దని కోరారు. దేశంలోని ఫండ్ మేనేజర్లను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని స్టాక్ మార్కెట్ వర్గాలు సీతారామన్ను కోరాయి. ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్ (ఈసాప్స్) ను సేల్ చేసినప్పుడు మాత్రమే ట్యాక్స్ వేయాలన్నాయి. ప్రస్తుతం ఈసాప్స్ ఉద్యోగులకు కేటాయించినప్పుడు కూడా ట్యాక్స్ వేస్తున్నారు. ఆప్షన్ ట్రేడింగ్పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రేట్లను పెంచాలన్నాయి. ఇన్సూరెన్స్ సెక్టార్ వర్గాలు లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ వంటివి ఒకే గొడుగు కింద అమ్మడానికి అవకాశం ఇవ్వాలని సీతారామన్ను కోరాయి. యాన్యుటీపై ట్యాక్స్ సులభతరం చేయాలని విన్నవించుకున్నాయి. ప్రస్తుతం రిటైర్మెంట్ అయిన తర్వాత యాన్యుటీపై వివిధ రకాల రేట్స్ వేస్తున్నారు. ఎన్పీఎస్ స్కీమ్స్కు తగ్గట్టు ట్యాక్స్ ఉండేలా చూడాలని మ్యూచువల్ ఫండ్ సెక్టార్ ఎక్స్పర్ట్లు కోరుతున్నారు. బ్యాంకులు మాత్రం క్రెడిట్ సిస్టమ్ను మెరుగుపరిచేందుకు ఒక ఫ్రేమ్వర్క్ తేవాలని సీతారామన్ను అడిగారు.