- త్వరలో ప్రైస్బ్యాండ్ను ప్రకటించే అవకాశం
- యుద్ధంపై అలర్ట్గా ఉన్నామన్న అధికారులు
న్యూఢిల్లీ: మనదేశంలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ఎల్ఐసీ తన ఐపీఓను మొదలుపెట్టడానికి ఈ ఏడాది మే 12 వరకు గడువు ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మరోసారి డాక్యుమెంట్లను అందజేయకుండానే ఆలోపు పబ్లిక్ ఇష్యూను తీసుకురావచ్చు. లేకపోతే డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను ఇచ్చాక సెబీకి ఎల్ఐసి తాజాగా పత్రాలను ఇవ్వాలి. నిజానికి ఎల్ఐసీ ఐపీఓ ఈ నెలలోనే రావాల్సి ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల మార్కెట్లో అతలాకుతలం రావడంతో కేంద్రం వెనుకడుగు వేసింది. ప్రభుత్వం ఫిబ్రవరి 13న ఐపీఓ కోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ)ని దాఖలు చేసింది. "సెబీకి దాఖలు చేసిన పేపర్ల ఆధారంగా ఐపీఓని ప్రారంభించడానికి మాకు మే 12 వరకు గడువు ఉంది. ప్రస్తుత పరిస్థితులను జాగ్రత్తగా గమనిచూస్తున్నాం. త్వరలోనే ఆర్హెచ్పీని ఫైల్ చేస్తాం. త్వరలో ప్రైస్ బ్యాండ్ ప్రకటిస్తాం" అని ఒక ఆఫీసర్ తెలిపారు. సెబికి దాఖలు చేసిన డిఆర్హెచ్పిలో ఎల్ఐసి ఆర్థిక ఫలితాలు, సెప్టెంబర్ 2021 వరకు పొందుపరిచిన వాల్యుయేషన్ వివరాలు ఉన్నాయి. అంతర్జాతీయ యాక్చురియల్ సంస్థ మిల్లిమాన్ అడ్వైజర్స్ రిపోర్టు ప్రకారం.. సెప్టెంబరు 30, 2021 నాటికి ఎల్ఐసీ లోని కన్సాలిడేటెడ్ షేర్హోల్డర్ల వాల్యూ సుమారు రూ.5.4 లక్షల కోట్ల వరకు ఉంది. డీఆర్హెచ్పీ ఎల్ఐసీ మార్కెట్ వాల్యుయేషన్ను వెల్లడించనప్పటికీ, ఇది ఎంబెడెడ్ వాల్యూ కంటే దాదాపు 3 రెట్లు ఉంటుంది.