- గుజరాత్కు వరుసగా రెండో విక్టరీ
న్యూఢిల్లీ: టార్గెట్ ఛేజింగ్లో సాయి సుదర్శన్ (48 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (16 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో.. ఐపీఎల్–16లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విక్టరీని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్కు చెక్ పెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 162/8 స్కోరు చేసింది.
కెప్టెన్ డేవిడ్ వార్నర్ (32 బాల్స్లో 7 ఫోర్లతో 37), అక్షర్ పటేల్ (22 బాల్స్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36) రాణించారు. తర్వాత గుజరాత్ 18.1 ఓవర్లలో 163/4 స్కోరు చేసి నెగ్గింది. సుదర్శన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. కారు యాక్సిడెంట్లో గాయపడి కోలుకుంటున్న రిషబ్ పంత్ ఈ మ్యాచ్కు హాజరయ్యాడు.
సుదర్శన్ నిలకడ..
ఛేజింగ్లో హోమ్టీమ్ పేసర్లు అన్రిచ్ (2/39), ఖలీల్(1/38) దెబ్బకు పవర్ప్లే ముగిసేసరికి సాహా (14), గిల్ (14), హార్దిక్ (5) ఔట్కావడంతో జీటీ 54/3 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. ఇక్కడి నుంచి సాయి సుదర్శన్ నిలకడగా ఇన్నింగ్స్ను నిర్మించాడు. రెండో ఎండ్లో ఇంపాక్ట్ ప్లేయర్ విజయ్ శంకర్ (29) కూడా పోరాడాడు. ఇద్దరూ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదారు.
ఈ క్రమంలో 10 ఓవర్లలో జీటీ 83/3తో గాడిలో పడింది. కానీ 14వ ఓవర్లో మార్ష్ దెబ్బకు విజయ్ ఔట్కావడంతో నాలుగో వికెట్కు 53 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఈ దశలో ముకేశ్ బౌలింగ్లో మిల్లర్ ఓ ఫోర్, 2 సిక్సర్లతో మ్యాచ్ను వన్సైడ్ చేశాడు. ఫోర్తో హాఫ్ సెంచరీ చేసిన సాయి వెంటనే మరో సిక్స్ బాది జీటీ విక్టరీ ఖాయం చేశాడు.
బౌలింగ్ అదుర్స్..
స్టార్టింగ్లో గుజరాత్ బౌలర్ల దెబ్బకు తడబడిన ఢిల్లీ ఆఖర్లో కోలుకుంది. ఆరంభంలో ఓ ఎండ్లో వార్నర్ ఫోర్లతో జోరు చూపెట్టినా.. రెండో ఎండ్లో చకచకా వికెట్లు పడ్డాయి. షమీ (3/41) దెబ్బకు థర్డ్ ఓవర్లో పృథ్వీ షా (7), ఐదో ఓవర్లో మిచెల్ మార్ష్ (4) ఔట్కావడంతో డీసీ పవర్ప్లేలో 52/2 స్కోరు మాత్రమే చేసింది. ఆపై, 9వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ (2/29) వరుస బాల్స్లో వార్నర్, రోసోవ్ (0)ను ఔట్ చేయడంతో 67/4తో కష్టాల్లో పడింది.
ఈ దశలో సర్ఫరాజ్ (30), అభిషేక్ పోరెల్ (20) పోరాటంతో సగం ఓవర్లకు 78/4 స్కోరు చేసింది. కానీ, రషీద్ (3/31) వరుస విరామాల్లో ఈ ఇద్దరినీ ఔట్ చేసి దెబ్బకొట్టాడు. అయితే, బౌండ్రీతో ఖాతా తెరిచిన అక్షర్ పటేల్ 15వ ఓవర్లో రషీద్ బాల్ను సిక్స్గా మలిచి జోరందుకున్నాడు. అమన్ హకీం ఖాన్ (8) సిక్స్ కొట్టి 19వ ఓవర్లో రషీద్ దెబ్బకు వెనుదిరిగాడు. ఈ మధ్యలో అక్షర్ మరో రెండు సిక్సర్లు కొట్టి ఔట్ కాగా, అన్రిచ్(4 నాటౌట్) ఫోర్ బాదాడు. చివరి పది ఓవర్లలో 84 రన్స్ రావడంతో డీసీ ఆ మాత్రం స్కోరు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 162/8 (వార్నర్ 37, అక్షర్ 36, రషీద్ 3/31, షమీ 3/41),
గుజరాత్: 18.1 ఓవర్లలో 163/4 (సాయి సుదర్శన్ 62*, మిల్లర్ 31*, అన్రిచ్ 2/39).