
బీఆర్ఎస్లో మరోసారి బయటపడ్డ విభేదాలు
ఉప్పల్లో ఎమ్మెల్యే, మేయర్ అనుచరుల మధ్య గొడవ
సికింద్రాబాద్, వెలుగు : బీఆర్ఎస్ లో నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ఉప్పల్లో సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. మంగళవారం చిలుకానగర్ డివిజన్ ఏడో వార్డులో రూ.2 కోట్ల విలువైన రోడ్ల పనులకు శంకుస్థాపన చేసేందుకు లోకల్ కార్పొరేటర్ బన్నాల గీతతో కలిసి మేయర్ అక్కడికి వెళ్లారు. విజ్ఞాన్ గ్రామర్ స్కూల్ లైన్ నుంచి బాలేందర్ షాప్ వరకు రూ.65 లక్షల ఖర్చుతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తుండగా.. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాశ్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చి అడ్డుకున్నారు.
లోకల్ ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఎమ్మెల్యే అనుచరులు మేయర్పైకి దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వాళ్లపై మేయర్ ఫైర్ అయ్యారు. ‘‘ఈ పనులు జీహెచ్ఎంసీ నిధులతో చేపడుతున్నాం. ఎమ్మెల్యేను పిలవాల్సిన అవసరం లేదు. ప్రొటోకాల్ విషయం అధికారులు చూసుకుంటారు. మొదట శనివారమే ఈ ప్రోగ్రామ్ ఉండగా, ఎమ్మెల్యే కోసమని మంగళవారానికి మార్చారు. ఆయన రాకుంటే మాదా తప్పు?” అని ప్రశ్నించారు. కాగా, ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నప్పటికీ మేయర్ మూడు ప్రాంతాల్లో రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేసి వెళ్లిపోయారు.
గొడవతో నాకేం సంబంధం లేదు: ఎమ్మెల్యే
రోడ్ల పనులకు శంకుస్థాపనపై తనకు సమాచారం ఇవ్వలేదని, అందుకే వెళ్లలేదని ఎమ్మెల్యే భేతి సుభాశ్ రెడ్డి చెప్పారు. అక్కడ జరిగిన గొడవతో తనకేం సంబంధం లేదని తెలిపారు. మేయర్తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.