న్యూఢిల్లీ : కొన్ని గంటల్లో పెండ్లి. బంధుమిత్రులంతా వచ్చేశారు. ఇంతలోనే పెండ్లికొడుకును చంపేశారు. ఛాతీ, ముఖంపై 15 సార్లు కత్తితో పొడిచి హతమార్చారు. ఈ దారుణానికి పాల్పడింది తండ్రేనని తేల్చిన పోలీసులు పరారీలో ఉన్న అతడిని పట్టుకున్నారు.
అవమానించాడన్న కోపంతోనే..
సౌత్ ఢిల్లీలోని దేవ్లీ ప్రాంతానికి చెందిన గౌరవ్ సింఘాల్(29) జిమ్ నడుపుతున్నాడు. అతడికి బుధవారం పెండ్లి జరగాల్సి ఉంది. కొద్దిరోజులుగా గొడవల కారణంగా తండ్రి రంగలాల్(50) కొడుకు గౌరవ్ను హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. గౌరవ్.. తండ్రిని అవమానించేవాడని, అది తట్టుకోలేకే చంపేశాడని చెప్పారు. పెండ్లికి కొన్ని గంటలు ఉందనగా, తన ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చిన తండ్రి.. కత్తెర, కత్తులతో గౌరవ్ ఛాతీ, ముఖంపై పొడిచారని, ఆపై డెడ్బాడీని దాచేందుకు ప్రయత్నించారని చెప్పారు. అనంతరం ఇంట్లో ఉన్న రూ.50 లక్షల క్యాష్, రూ.15 లక్షల విలువ చేసే నగలతో రంగలాల్ పరారయ్యాడని తెలిపారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేశామని, మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నామని చెప్పారు. అయితే, గౌరవ్ మరో అమ్మాయిని పెండ్లి చేసుకోవాలని అనుకున్నాడని, ఈ విషయంలోనే తండ్రీ కొడుకుల మధ్య కొద్దిరోజులుగా గొడవలయ్యాయని స్థానికులు చెప్తున్నారు. ఓ సారి గౌరవ్ తన తండ్రిని జనాలందరి ముందే కొట్టి అవమానించాడని అంటున్నారు.